ఆర్మూర్ పట్టణం (నిజామాబాద్) : రోడ్డుపై ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో 15మందికి తీవ్రగాయాలైన ఘటన శుక్రవారం నిజామాబాద్లో చోటుచేసుకుంది. 38మంది ప్రయాణీకులతో రాయచూర్ నుండి హైదరాబాద్కు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు... నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15మందికి తీవ్రగాయాలవ్వగా, మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నిజామాబాద్లోని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రగాయాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ నిద్రమత్తులో ఉండి బస్సు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై సిఐ సురేశ్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










