Nov 10,2023 21:10

న్యూయార్క్‌ : కరోనా కాలంలో ఓ వెలుగు వెలిగిన ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆ సంస్థకు అమెరికాలోని బైజూస్‌ యూనిట్‌ను రుణ దాతలు స్వాధీనం చేసుకోవడం సబబేనని డెలావేర్‌ కోర్టు తీర్పును ఇచ్చింది. బైజూస్‌ పలు సార్లు రుణ చెల్లింపు నిబంధనలను ఉల్లఘించిందని కోర్టు పేర్కొంది. బైజూస్‌కు రెడ్‌వుడ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, సిల్వర్‌ పాయింట్‌ క్యాపిటల్‌ సహా మరికొన్ని సంస్థలు 1.2 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.10వేల కోట్లు) అప్పు ఇచ్చాయి. కరోనా తర్వాత బైజూస్‌ అప్పుల వాయిదాలు చెల్లించడంలో విఫలమైంది. దీంతో రుణదాతలు ఎంపిక చేసిన టిమోతీ పోల్‌ అనే వ్యక్తి కంపెనీకి చెందిన 'బైజూస్‌ ఆల్ఫా'లో ఏకైక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ నియామకం రుణ షరుతల ప్రకారమే జరిగినట్లు తాజాగా కోర్టు తేల్చింది. ఆయన నియామకాన్ని సవాల్‌ చేస్తూ బైజూస్‌ వేసిన పిటిషన్‌ను కొట్టిపరేసింది. రుణ ఎగవేతలకు పాల్పడినందు వల్ల టీమోటీ పోల్‌ నియామకం సరైన చర్య అని పేర్కొంది.