ప్రజాశక్తి-కందుకూరు :నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ కందుకూరులోని టిడిపి కార్యాలయం వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారంకొనసాగాయి. నియోజకవర్గ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో, 8వ రోజు దీక్షలు చేపట్టారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి దళిత సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు తో పాటు, నెల్లూరు పార్లమెంట్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కాకి ప్రసాదు, పలువురు ఎస్సీ సెల్ నాయకులు దీక్షలో కూర్చున్నారు. దీక్ష ముగింపు సందర్భంగా ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలను అభివద్ధి పథంలో నడిపి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన చంద్రబాబు నాయుడు అరెస్ట్, కోర్టు విచారణ వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తప్పులు మీద తప్పులు చేస్తూనే ఉన్నారని విమర్శించారు. నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాయపాటి శ్రీనివాసరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి చదలవాడ కొండయ్య ఉన్నారు.










