
ప్రతి దేశంలో పాలకులు పాడుతున్న పాచిపాటనే అమెరికా అధినేత జో బైడెన్ కూడా పాడాడు. రైల్వే కార్మికులు సమ్మె జరిపితే ఇతర కార్మికులు, వారి కుటుంబాలు ఇబ్బంది పడతాయంటూ గుండెలు బాదుకుంటూ రెచ్చగొట్టాడు. సమ్మెతో ఇంథనం, ఔషధాలు ఇతర నిత్యావసర వస్తు సరఫరాకు ఆటంకం కలుగుతుందని, రోజుకు రెండు బిలియన్ డాలర్ల మేరకు ఆర్థిక వ్యవస్థకు నష్టం అంటూ కొందరు అప్పుడే చిట్టాలు రూపొందించి జనాన్ని భయపెట్టేందుకు పూనుకున్నారు. లక్షా పదిహేను వేల మంది కార్మికులకు ప్రాతినిధ్యం వహించే పన్నెండు సంఘాలలో నాలుగు ప్రభుత్వం రుద్దిన ఒప్పందాన్ని తిరస్కరించాయి. కార్మిక సంఘాలలో వచ్చిన ఈ చీలికను ఆసరా చేసుకొని ప్రభుత్వం పార్లమెంటు ద్వారా బలవంతంగా అమలుకు పూనుకుంది.
ఒక వివాదాన్ని పరిష్కరించటం చేతగాని అమెరికా ప్రభుత్వం...మూడు సంవత్సరాలు వేచి చూసిన కార్మికులు తలపెట్టిన సమ్మెను అణచి వేసేందుకు ఏకంగా పార్లమెంటునే రంగంలోకి దించింది. దీనికి ప్రతిపక్ష రిపబ్లికన్లు కూడా వంత పాడారు. అధికార డెమోక్రటిక్ పార్టీ కార్మిక పక్షపాతి అని వర్ణిస్తున్నవారు ఈ తీరుతో విస్తుపోతున్నారు. ఈ నెల తొమ్మిది నుంచి తలపెట్టిన రైల్వే సమ్మెను అడ్డుకొనేందుకు జో బైడెన్ సర్కార్ పార్లమెంటులో చట్టాన్ని చేసింది. ప్రభుత్వ మధ్యవర్తిత్వంలో సెప్టెంబరులో రైల్వే కంపెనీలు ప్రతిపాదించిన ఒప్పందాన్ని కొన్ని కార్మిక సంఘాలు తిరస్కరించాయి. దీంతో దాన్ని బలవంతంగా రుద్దేందుకు పార్లమెంటు దిగువ సభలో 290-137 మెజారిటీతో ఒక బిల్లును ఆమోదించారు. డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీలకు చెందిన వారు సమ్మెను భగం చేసేందుకు పూనుకున్నందున ఎగువ సభ సెనెట్ ఆమోదం కూడా లాంఛనమే.
ఐరోపా లోని బ్రిటన్తో సహా అనేక దేశాల్లోని రైల్వే కార్మికులు కూడా పోరుబాట పట్టారు. ఇప్పటికే కొన్ని చోట్ల సమ్మెలు జరపగా ఈ నెలలో మరికొన్ని జరిపేందుకు ముందుకు సాగుతున్నారు. కరోనా సాకుతో అనేక మంది సిబ్బంది తొలగింపు, సాధారణ స్థితి ఏర్పడిన తరువాత కూడా తొలగించిన మేరకు కొత్త వారిని తీసుకోకపోవటంతో పని భారం పెరిగింది. పాత ఒప్పందాల గడువు తీరిన తరువాత కూడా కొత్త వాటిపై సంప్రదింపుల పేరుతో సాగదీస్తున్నారు. దీనికి తోడు పులి మీద పుట్రలా పెరుగుతున్న దవ్య్రోల్బణం, ధరల పెరుగుదలతో నెల తిరక్కుండానే జేబులు ఖాళీ అవుతుండటంతో నిజవేతనాలు పడిపోయి విధిలేని స్థితిలో కార్మికులు వీధుల్లోకి వస్తున్నారు. జనానికి ఇబ్బంది కలగకుండా విరామం ఇస్తూ వారానికి ఒక రోజు లేదా రెండు మూడు రోజుల సమ్మెలతో జరుపుతున్న ఆందోళనను పాలకులు పెడచెవిన పెడుతున్నారు. ఇదే వైఖరి కొనసాగితే నిరవధిక సమ్మెలకు దిగినా ఆశ్చర్యం లేదు.
ప్రతి దేశంలో పాలకులు పాడుతున్న పాచిపాటనే అమెరికా అధినేత జో బైడెన్ కూడా పాడాడు. రైల్వే కార్మికులు సమ్మె జరిపితే ఇతర కార్మికులు, వారి కుటుంబాలు ఇబ్బంది పడతాయంటూ గుండెలు బాదుకుంటూ రెచ్చగొట్టాడు. సమ్మెతో ఇంథనం, ఔషధాలు ఇతర నిత్యావసర వస్తు సరఫరాకు ఆటంకం కలుగుతుందని, రోజుకు రెండు బిలియన్ డాలర్ల మేరకు ఆర్థిక వ్యవస్థకు నష్టం అంటూ కొందరు అప్పుడే చిట్టాలు రూపొందించి జనాన్ని భయపెట్టేందుకు పూనుకున్నారు. లక్షా పదిహేను వేల మంది కార్మికులకు ప్రాతినిధ్యం వహించే పన్నెండు సంఘాలలో నాలుగు ప్రభుత్వం రుద్దిన ఒప్పందాన్ని తిరస్కరించాయి. కార్మిక సంఘాలలో వచ్చిన ఈ చీలికను ఆసరా చేసుకొని ప్రభుత్వం పార్లమెంటు ద్వారా బలవంతంగా అమలుకు పూనుకుంది. నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా 24 శాతం వేతనం పెంపుదల అని చెబుతున్నప్పటికీ ఆరోగ్య బీమా ఖర్చు, ఇతర కోతలు పోను పదిహేనుశాతం కంటే ఉండదని కార్మికులు చెబుతున్నారు. ఒప్పందాన్ని ఒప్పుకుంటే రైల్వే కార్మికులకు ఏడాదికి ఏడు రోజులు వేతనంతో కూడిన అనారోగ్య సెలవులు ఇచ్చేందుకు పార్లమెంటు విడిగా మరో బిల్లును కూడా ఆమోదించి కార్మికులకు ఒక బిస్కెట్ విసిరింది. దిగజారిన పని పరిస్థితుల కారణంగా ఎయిర్లైన్స్ సిబ్బంది కూడా ఆందోళనకు సిద్ధం అవుతున్నారు. కరోనాకు ముందు నుంచే కొత్త ఒప్పందం కోసం డిమాండ్ చేస్తుండగా పెడచెవిన పెట్టినందున గత నెలలో కొన్ని చోట్ల ధర్నాలు చేశారు. ఇంతవరకు ఎక్కడా లేని విధంగా ఒకే పైలట్తో విమానాలను నడిపేందుకు సిబ్బంది అంగీకరించాలని కంపెనీలు ఒత్తిడి తెస్తున్నాయి. అమెరికాలో ఎనిమిది శాతం ద్రవ్యోల్బణం పెరిగితే ఆ పేరుతో విమాన ఛార్జీలను ఏకంగా 42.9 శాతం పెంచి ప్రయాణీకులను కూడా దోపిడి చేస్తున్నాయి. కరోనా పేరుతో సిబ్బందిని తొలగించకూడదంటూ ప్రభుత్వం ఇచ్చిన 54 బిలియన్ డాలర్ల సబ్సిడీ పొందిన కంపెనీలు 80 వేల మందికి ఉద్వాసన పలికాయి.
ఐరోపా లోని బెల్జియం రైల్వే కార్మికులు కూడా ఆందోళన బాట పట్టారు. మొత్తం సిబ్బంది ఒక రోజు సమ్మె జరపగా డ్రైవర్లు మూడు రోజులు సమ్మె చేశారు. పని ఒత్తిడి ఎంతగా ఉందంటే డ్రైవర్లు నడుపుతూనే భోజనం చేయాలి. సిబ్బంది కొరత కారణంగా రైళ్లను రద్దు చేస్తున్నారు. బ్రిటన్లో ఈ నెలలో ఎనిమిది రోజులు ఆందోళన చేపట్టేందుకు రైల్వే సిబ్బంది పూనుకున్నారు. దీంతో ఐరోపాలోని ఇతర దేశాలకు వెళ్లే రైళ్ల మీద కూడా ప్రభావం పడనుంది. ఆస్ట్రియాలో ఒక రోజు హెచ్చరిక సమ్మె చేశారు. ఫ్రెంచి రాజధాని పారిస్లో మెట్రో సిబ్బంది, ఇటలీ లోని రైల్వే, మెట్రో సిబ్బంది కూడా ఆందోళనలు జరుపుతున్నారు. బ్రిటన్లో ఈ ఏడాది అతి పెద్ద పారిశ్రామిక ఆందోళనగా వర్ణిస్తున్న లక్షలాది మంది పోస్టల్, కాలేజీ, విశ్వవిద్యాలయాల సిబ్బంది ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు.
మినీ బడ్జెట్ పేరుతో నూతన ప్రధాని రిషి సునాక్ ప్రకటించిన పథకాలేవీ వారి డిమాండ్లను పరిష్కరించేవిగా లేకపోవటంతో రానున్న రోజుల్లో మరింతగా ఆందోళనలు చెలరేగే అవకాశం ఉంది. పదేళ్ల టోరీ పార్టీ పాలన పొదుపు పేరుతో రుద్దిన భారాలకు ఇది ప్రతిస్పందన అని చెప్పవచ్చు. నిజవేతనాలు పడిపోవటం, ఇటీవలి ధరల పెరుగుదల కార్మికుల జీవన పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. కార్మికవర్గం కదులుతున్న తీరును చూసిన కార్పొరేట్ పత్రిక ది టైమ్స్ పాలక వర్గాలను హెచ్చరించింది. నిజంగా బ్రిటన్ చలికాలంలో నూతన అసమ్మతిని ఎదుర్కొంటున్నదని అనుకుంటే అది మొన్ననే ప్రారంభమైంది. కార్మిక సంఘాలలో నూతన తరం మిలిటెంట్స్ వచ్చారని నమ్మితే ఇది ప్రారంభం మాత్రమే అని కూడా అది హెచ్చరించింది. ఇది ఒక్క బ్రిటన్కే అనుకుంటే పొరపాటు. అన్ని దేశాల పాలకవర్గ బాకాల సందేశాల సారం ఇదే !
ఎం.కె.ఆర్