May 14,2023 07:59

నిస్సందేహంగా ఇది మతతత్వంపై, అవినీతిపై ప్రజలిచ్చిన తీర్పు. కాంగ్రెస్‌ నాయకత్వం అనైక్యత నుంచి బయటపడటానికి చాలా కసరత్తు అవసరమైంది. అలాగే గతవారం చెప్పుకున్నట్టు మతపరమైన సమీకరణలను సంతృప్తి పర్చే బదులు సమస్యల పరిష్కారం ప్రజలకు రాయితీలే వాగ్దానాలుగా కాంగ్రెస్‌ ప్రణాళిక విడుదల చేసింది. అదే ప్రజలను ఆకర్షించింది. ఆదరణ పొందింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ట్రాఫిక్‌ సమస్యలు, శాంతిభద్రతలు ప్రతిదీ ప్రజల ఆగ్రహానికి కారణమైంది. బిజెపి అమితోత్సాహంతో ముందుంచిన వివాదాస్పద అంశాలు ప్రజలలో ఉద్వేగం పెంచలేకపోయాయి. అలా అని ఒక్కసారిగా కర్ణాటక లౌకిక విధానమే తీసుకుందని కాదు. మతతత్వ ఘర్షణలు, వివాదాలు, విద్వేష వాదనలకు మాత్రం తావు లేదని చెప్పింది.

           కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ అఖండ విజయం సాధించింది. ఈ విజయం ప్రత్యేకత ఏమంటే ఇంతవరకూ గత ముప్పై ఐదేళ్లలో ఏ పార్టీ కూడా రాష్ట్రంలో ఇంత పెద్ద విజయం అందుకున్న దాఖలాలు లేవు. 1989లో వీరేంద్ర పాటిల్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ 43.76 శాతం ఓట్లతో 178 స్థానాలు సాధించింది. 1999లో 40.84 ఓట్లతో 132 సీట్లు, 2013లో 36.6 శాతంతో 122 సీట్లు పొందింది. ఇప్పుడు 136 స్థానాలు వచ్చాయంటే రాష్ట్రాన్ని పాలిస్తున్న బిజెపి ఎంత ఘోరంగా ఓడిపోయిందో దానిపై ప్రజల వ్యతిరేకత ఏ స్థాయిలో వుందో తెలుస్తుంది. అదే బిజెపి సంగతి చూస్తే ఇంతవరకూ ఒక్కసారి కూడా పూర్తి మెజార్టీ తెచ్చుకోలేదు. ఎప్పుడూ మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇతర పార్టీల వారిని చేర్చుకోవడం ద్వారానే గట్టెక్కిన పరిస్థితి. జెడిఎస్‌ మాత్రం దేవెగౌడ నాయకత్వంలో 1994లో 33.54 శాతం ఓట్లతో 115 స్థానాలు తెచ్చుకున్నది. కాని తర్వాత నుంచి దాని బలం క్షీణించి తృతీయ పక్షంగానే పరిణామాలను ప్రభావితం చేయగలిగింది. అదే బిజెపిని తీసుకుంటే యెడియూరప్ప నాయకత్వంలో 2004లో 79 స్థానాలు, 2008లో 110 స్థానాలు, 2018లో 104 స్థానాలు మాత్రమే తెచ్చుకోగలిగింది. అయినా జెడిఎస్‌ అవకాశవాద కలయిక కారణంగా అధికారం చేయగలిగింది. వరుస ఫిరాయింపులను ప్రోత్సహించడమే గాక పార్టీ మారిన వారందరినీ మంత్రులను చేసి గట్టెక్కగలిగింది. వారిని ఆ తర్వాత రాజీనామా చేయించి గెలిపించుకోవడం గొప్పగా చెప్పుకుంది. ఈ అవకాశం కోసం బిజెపి నేరుగా గాలి జనార్థనరెడ్డి మైనింగ్‌ మాఫియాకు వత్తాసునిచ్చింది. మంత్రులను చేసింది. దక్షిణ భారతంలో బిజెపి అధికారంలోకి వచ్చిన ఒకే ఒక రాష్ట్రం వెనక రాజకీయ నేపథ్యం ఇలా వుంది. మధ్యలో గాలి, యెడియూరప్పలపై కేసులు, అరెస్టులు వంటి పరిణామాలు చాలా జరిగాయి. యెడియూరప్ప స్వంత పార్టీ పెట్టుకుని మళ్లీ తిరిగి వచ్చి చేరడం ఒకటైతే గాలి ఇప్పుడు వేరు కుంపటి పెట్టారు.
 

                                                                 కుటిల మత, ధన రాజకీయాలు

కర్ణాటక అధికారం కోసం బిజెపి మత రాజకీయాలను ప్రోత్సహించడం, యెడియూరప్ప కుల రాజకీయాలను పెంచడం అందిరికీ తెలుసు. ఆర్థిక, రాజకీయ, పాలనాపరమైన అవినీతికి ప్రతీకగా ఆయన నడిపిన రాజకీయాల చరిత్ర అంతగా తెలియదు. ఎందుకంటే లింగయాత్‌లను సమీకరించి గెలిపించడమే గొప్పగా ప్రచారమవుతుంటుంది. అంతకంటే దారుణమైంది మత రాజకీయాలను రెచ్చగొట్టడం. హిందూత్వ విద్వేష రాజకీయాలకు ప్రవేశం కల్పించడం. వాటివల్ల కర్ణాటక రాజకీయాల స్వరూపమే మారిపోయింది. హిందూ ముస్లిం తగాదాలు, ప్రార్థనా స్థలాల వివాదాలు, టిప్పు తదితరుల చరిత్రలు తిరగదోడి వివాదాలు పెంచడం, గౌరీ లంకేశ్‌, కల్బుర్గి వంటి వారి హత్యలు, శ్రీరామ్‌ సేన వంటి వాటితో ప్రేమికులపై దాడులు చేయడం ఒకటేమిటి అదివరకు కర్ణాటకకు తెలియని దారుణాలెన్నిటికో బిజెపి కుటిల వ్యూహాలు కారణమైనాయి. ఈ మధ్యలో మళ్లీ యెడియూరప్ప వ్యక్తిగత రాజకీయ పేరాశలు, కార్పొరేట్‌ శక్తుల ప్రాబల్యం, కబ్జాలకు కర్ణాటక చిరునామాగా మారింది. రాజకీయ అవసరాల కోసం బిజెపి ఢిల్లీ నేతలు ఈ పోకడలకు వంత పాడారు. ఈ విధంగా మతతత్వ రాజకీయాలు రాష్ట్రాన్ని కల్లోలితం, కలుషితం చేశాయి. ఇందుకు ప్రతిగా ఇస్లామిక్‌ తీవ్రవాదం కూడా ప్రవేశించింది. ప్రశాంత పారిశ్రామిక సాంకేతిక నగరమైన బెంగళూరు అభద్రతలకు నిలయమైంది. కాంగ్రెస్‌కు ప్రత్యర్థిగా వుండిన జనతాదళ్‌ దాని తదుపరి రూపాలైన జెడిఎస్‌ వంటివి కూడా అవకాశవాదానికి పాల్పడ్డం ఈ కుట్రలకు ఊపిరిపోసింది. ప్రధానిగా దేశానికి దేవెగౌడను అందించిన జనతాదళ్‌ పరివారం ఉత్తరోత్తరా జెడిఎస్‌ రూపంలో కాంగ్రెస్‌, బిజెపిల మధ్య దోబూచులాటకు కారణమైంది.
 

                                                                      ఎందుకు విఫలమైంది ?

2014లో మోడీ రాజకీయం మొదలైనాక కర్ణాటకలో దాన్ని తీవ్ర రూపంలో అమలు చేయడంతో పరిస్థితి మరీ దిగజారింది. 2023 ఎన్నికలలో బజరంగ్‌దళ్‌ నిషేధం ఆధారంగా ప్రచారం ముందుకు తేవడం మోడీ సభల్లో అదే నినాదం కావడం ఇందుకు పరాకాష్ట. దీనికి ముందు హిజాబ్‌ వివాదం, టిప్పుసుల్తాన్‌ ప్రతిదీ సమస్యాత్మకమైంది. ఇలాంటి నేపథ్యంలోనే 2023 ఎన్నికల తీర్పు విలక్షణమైందిగా చెప్పవలసి వస్తున్నది. సర్వేలు, ఒపీనియన్‌ పోల్స్‌, ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నిటిలోనూ దాదాపుగా కాంగ్రెస్‌ పెద్ద పార్టీగా చూపించినా వాస్తవంగా వున్న ఆధిక్యతను చెప్పడానికి బిజెపి భయమే ఆటంకమైంది. ఇప్పుడు ఫలితాలు చూస్తే అసాధారణ విజయంగా గోచరిస్తున్నది. నిస్సందేహంగా ఇది మతతత్వంపై, అవినీతిపై ప్రజలిచ్చిన తీర్పు. కాంగ్రెస్‌ నాయకత్వం అనైక్యత నుంచి బయటపడటానికి చాలా కసరత్తు అవసరమైంది. అలాగే గతవారం చెప్పుకున్నట్టు మతపరమైన సమీకరణలను సంతృప్తి పర్చే బదులు సమస్యల పరిష్కారం ప్రజలకు రాయితీలే వాగ్దానాలుగా కాంగ్రెస్‌ ప్రణాళిక విడుదల చేసింది. అదే ప్రజలను ఆకర్షించింది. ఆదరణ పొందింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ట్రాఫిక్‌ సమస్యలు, శాంతిభద్రతలు ప్రతిదీ ప్రజల ఆగ్రహానికి కారణమైంది. బిజెపి అమితోత్సాహంతో ముందుంచిన వివాదాస్పద అంశాలు ప్రజలలో ఉద్వేగం పెంచలేకపోయాయి. అలా అని ఒక్కసారిగా కర్ణాటక లౌకిక విధానమే తీసుకుందని కాదు. మతతత్వ ఘర్షణలు, వివాదాలు, విద్వేష వాదనలకు మాత్రం తావు లేదని చెప్పింది. బజరంగ్‌దళ్‌ నిషేధం అంటే ఆంజనేయుడిపై నిషధమేనన్నట్టు ప్రచారం చేస్తే ప్రజలు కొట్టుకుపోలేదు. వాస్తవంలో దీనికి వ్యతిరేకంగా సమీకరణ జరుగుతుందని కూడా కాంగ్రెస్‌ వ్యూహాత్మక ఆలోచన చేసి ఫలప్రదమైంది. స్థానిక బిజెపి నేతలు, మంత్రులు కూడా ప్రతిష్ట కోల్పోయిన పరిస్థితులలో ప్రచారానికి ప్రధాని మోడీనే ఏకైక ప్రచారకుడుగా తిరగాల్సి వచ్చింది. అయినా ఘోరమైన ఓటమి తప్పలేదంటే మోడీ జనాకర్షణ పరిమితులు కూడా స్పష్టమైనాయి. కాంగ్రెస్‌ ముక్త భారత్‌ అంటూ నిరంతరం మాట్లాడుతుండగా వాస్తవంలో బిజెపి ముక్త దక్షిణ భారత్‌ అవతరించింది (పాండిచ్చేరి మినహా). దక్షిణాదిన కేరళ, తమిళనాడు, ఎ.పి, తెలంగాణ రాష్ట్రాలలో బిజెపి కాలూనడం పెద్ద రాజకీయ సవాలుగా తయారైంది. ఉత్తర భారతంలో విజయం చేకూర్చిన హిందూత్వ నమూనా రాజకీయాలు దక్షిణాన చెల్లబోవని తేటతెల్లమైంది. మొన్ననే సుప్రీం కోర్టు ఢిల్లీ, మహారాష్ట్ర పరిణామాలపై ఇచ్చిన తీర్పు కూడా కేంద్రం పెత్తనానికి చివాట్లు పెట్టింది. నిజానికి ఆ జాబితాలో కర్ణాటక కూడా ఒకటిగా వుండేది. ఇక్కడ నేరుగా ప్రజలే తమ తీర్పుతో మర్చిపోలేని పాఠం నేర్పారు.
 

                                                                             కాంగ్రెస్‌ కసరత్తు

కాంగ్రెస్‌ పునరుద్ధరణ క్రమంలో ఈ తీర్పు మరో మైలురాయి అవుతుంది. రాహుల్‌ గాంధీ 'భారత్‌ జోడో యాత్ర' నిజంగానే కొంత ఐక్యత పెంచడంతో పాటు ఓటర్లను ప్రభావితం చేసింది. దళిత నేత మల్లిఖార్జున ఖర్గే ఎఐసిసి అధ్యక్షుడు కావడం సానుకూలత పెంచింది. ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న డి.కె.శివకుమార్‌, గత ముప్పయ్యేళ్లలో పూర్తికాలం బాధ్యత నిర్వహించిన ఒకే ఒక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యల సఖ్యత కోసం కూడా రాహుల్‌ గాంధీ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. బిజెపి విధానాలు నచ్చక పోవడం, విజయావకాశాలు లేకపోవడం వల్ల చివరి క్షణాల్లో కాంగ్రెస్‌ తీర్థం తీసుకున్న మాజీ సి.ఎం జగదీశ్‌ షట్టర్‌ వంటివారిని కూడా చేర్చుకుని పోటీ చేయించింది. కీలక నేతలు విడివిడిగా చేసిన వాగ్దానాలన్నీ కలిపి అయిదు హామీలుగా ఎన్నికల్లో ప్రచారం చేసింది. ఇవన్నీ సానుకూల ప్రభావం నెరిపాయి. జెడిఎస్‌ అవకాశవాదానికి విరుగుడుగానూ పనిచేశాయి. పోలింగ్‌ ముగిసిన మరు రోజునే కుమారస్వామి తనే కింగ్‌ మేకర్‌నవుతాననీ, కాంగ్రెస్‌ బిజెపి రెండింటితో మాట్లాడుతున్నానని చెప్పడం ఇందుకు అద్దం పట్టింది. తీరా ఆయనే ఓట్ల లెక్కింపు కన్నా ముందే ఈసారి తన పాత్ర వుండకపోవచ్చని ఒప్పుకోవలసి వచ్చింది. విశ్వసనీయత కోల్పోయిన ఫలితమిది. ఈ ఓట్లు, సీట్లు కూడా కాంగ్రెస్‌ వైపు మరలడం ఒక కీలక పరిణామం. తొలి ఫలితాల్లో కొంత అస్పష్టత వుండటంతో బిజెపి జెడిఎస్‌తో మంతనాలు ప్రారంభించి భంగపడింది. గాలి జనార్ధనరెడ్డి ఎన్నికవడం, ఇద్దరు రెబల్‌ అభ్యర్థులు కూడా నెగ్గడం ఈసారి కొత్త పరిణామం. వీరిలో కొందరు కాంగ్రెస్‌లో చేరినా ఆశ్చర్యంలేదు. ఈ ఎన్నికల గురించిన అనేక అంశాలను ముందు ముందు సమీక్షించుకోవలసే వుంటుంది.
 

                                                                                 కీలక కర్తవ్యం

ఇక ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి ఎవరనేదానిపై చర్చ ఉత్కంఠ కేంద్రీకృతమైంది. సిద్దరామయ్య, శివకుమార్‌లలో ఎవరో ఒకరికి ఈ పదవి లభించవచ్చు. అలాగాక ఇద్దరినీ పదవీ కాలం సమంగా విభజించి అవకాశం ఇవ్వొచ్చనేది మరో అంచనా. ఉప ముఖ్యమంత్రి పదవి కల్పించవచ్చు కూడా. అనేక కోణాలలో సీనియారిటీ రీత్యా సిద్దరామయ్యకు అవకాశం రావచ్చు. రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌లలో అనుభవాలు కూడా కాంగ్రెస్‌ ముందున్నాయి. ఈ వివాదంతో కాంగ్రెస్‌ చీలిపోతుందని కూడా బిజెపి నేతలు, వారి అనుకూలురు కథలు వదులుతున్నారు. కాంగ్రెస్‌ సీట్లలో సగం కూడా తెచ్చుకోలేకపోయిన బిజెపి అంత దుస్సాహసం చేయకపోవచ్చు. ఈ ఫలితాల ప్రభావం పక్కనే వున్న తెలంగాణపై తప్పక వుంటుందని కూడా పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు. బిఆర్‌ఎస్‌ బిజెపిని గట్టిగా వ్యతిరేకిస్తున్న కారణంగా ఇది సానుకూల పరిణామంగా పరిగణించి శుభాకాంక్షలు చెప్పింది. అయితే ఇతర వైరుధ్యాలు కొనసాగుతుంటాయి గనక తమకే మేలు చేస్తుందని కాంగ్రెస్‌ వారంటున్నారు. ఆ ఊహాగానాల కన్నా మతోన్మాదాన్ని, కేంద్రం నిరంకుశత్వాన్ని ఎదుర్కోవడం కీలకం. ఇప్పటికే వెనకబడి పోయిన బిజెపి ఈ దెబ్బతో మరింత వెనక్కుపోవలసి రావచ్చు.
        ఎ.పి లో బిజెపితో అంటకాగుతున్న మూడు ప్రాంతీయ పార్టీలకు కూడా ఇదొక కనువిప్పు కావాలి. ఇక వారితో పొత్తు గురించి కలవరిస్తున్న పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు నాయుడు వంటి వారు కూడా కళ్లు తెరవాల్సి వస్తుంది. 2024 ఎన్నికల పోరాటానికి అవసరమైన అవగాహన కోసం లౌకిక శక్తులు కృషి చేయాల్సి వుంటుంది. కర్ణాటకలో వలె ఒక బలమైన శక్తిగా లేకున్నా కేంద్రాధికారాలతో మత రాజకీయ ప్రభావంతో రాష్ట్రానికి నష్టం చేస్తున్న బిజెపిపై ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరాన్ని ఈ తీర్పు మరోసారి గుర్తుచేస్తుంది. పోరాడగలమనే భరోసా ఇస్తుంది. తక్షణమే జరిగే నాలుగు హిందీ రాష్ట్రాలలోనూ బిజెపితో తలపడటానికి అవసరమైన స్థయిర్యం కాంగ్రెస్‌కు పెరుగుతుంది. ఏకపక్ష రాజకీయాల స్థానే బహుళ పక్ష ప్రజాస్వామ్యాన్ని పున:ప్రతిష్టించడం, రాజ్యాంగంలోని లౌకిక, సమాఖ్య విలువలకు పట్టం కట్టడం ఈ తీర్పు అసలైన ప్రాధాన్యత.

తెలకపల్లి రవి

Renewal-of-secular-forces