Jun 24,2023 07:32
  • విలీనం పేరుతో ఎయిడెడ్‌, యుపి పాఠశాలలు మూత
  • ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రేషనలైజేషన్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పాఠశాలలను మూసివేసేందుకు పూనుకుంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని విలీనం పేరుతో మూసివేతకు సిద్ధమైంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న ఎయిడెడ్‌ పాఠశాలలను విలీనం చేయాలని, 6, 7, 8 తరగతుల్లో 30లోపు విద్యార్థులు ఉన్న యుపి పాఠశాలలను విలీనం చేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ జిఓ 59, 60ను శుక్రవారం విడుదల చేశారు. ఈ రెండు నిర్ణయాలు వల్ల ఇటు ఎయిడెడ్‌ పాఠశాలలు, అటు యుపి పాఠశాలలు కనుమరుగు కానున్నాయని విద్యావేత్తలు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య 30లోపు ఉన్న ఎయిడెడ్‌ ప్రాథమిక పాఠశాల(పిఎస్‌)ను కిలోమీటర్‌ పరిధిలో ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేయనుంది. అదేవిధంగా ఎయిడెడ్‌ యుపి పాఠశాలల్లో 6, 7 తరగతుల సంఖ్య 35 కంటే తక్కువగా ఉంటే మూడు కిలోమీటర్ల పరిధిలో యుపి పాఠశాలల్లో విలీనం చేయనుంది. విదార్థుల సంఖ్య 75 కంటే తక్కువగా ఉన్న ఉన్నత పాఠశాలలను మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలల్లో విలీనం చేయనుంది. ఈ విలీనం కానున్న పాఠశాలల్లో టీచర్లను మిగులుగా పేర్కొంది. ఎయిడెడ్‌ పాఠశాలల్లో రేషనలైజేషన్‌ మార్గదర్శకాలను జిఓ 59లో ప్రభుత్వం పేర్కొంది. 6, 7, 8 తరగతుల విద్యార్థుల సంఖ్య 30 కంటే తక్కువగా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులను 3 కిలోమీటర్లకు మించి దూరంగా ఉన్న ఉన్నత పాఠశాలలో గానీ, మరో ప్రాథమికోన్నత పాఠశాలలో గానీ విలీనం చేయాలని పేర్కొంది. 6, 7, 8 తరగతుల విద్యార్థుల సంఖ్య 30కు మించి ఉంటే ముగ్గురు సబ్జెక్టు టీచర్లు ఉండాలని ఉత్తర్వుల్లో తెలిపింది. అది కూడా విద్యార్థుల సంఖ్య 98 దాటితేనే సబ్జెక్టు టీచర్లు ఉంటారని పేర్కొంది. విద్యార్థుల సంఖ్య 30 దాటిన 484 యుపి పాఠశాలలకు 1,452 సబ్జెక్టు టీచర్లను మంజూరు చేసింది. ఎయిడెడ్‌ ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు 60 మంది విద్యార్థులుంటే ఇద్దరు టీచర్లు ఉండాలని పేర్కొంది. విద్యార్థుల సంఖ్య 90 వరకు ఉంటే మూడో టీచర్‌, 120 వరకు ఉంటే నాలుగో టీచర్‌ను కేటాయించింది. విద్యార్థుల సంఖ్య 120 నుంచి 200 మధ్య ఉంటే కేవలం ఐదుగురు టీచర్లను మాత్రమే కేటాయించింది. విద్యార్థుల సంఖ్య 150కు మించితే ప్రధానోపాధ్యాయులతోపాటు ఐదుగురు టీచర్లు ఉండాలని పేర్కొంది. 200 దాటితే ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం భర్తీ చేయాలని తెలిపింది. 6 నుంచి 8వ తరగతి వరకు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రతి తరగతికి సైన్స్‌, మేథ్స్‌, సోషల్‌ స్టడీస్‌, ల్యాంగ్వేజ్‌ టీచర్‌ ఉండాలని పేర్కొంది. ప్రతి 35 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ ఉండాలని తెలిపింది. విద్యార్థుల సంఖ్య 75లోపు ఉన్న ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, పిఇటి కాకుండా ఆరుగురు టీచర్లు ఉండాలి. విద్యార్థుల సంఖ్య 200లోపు ఉంటే ప్రధానోపాధ్యాయులు, పిఇటితో కలిపి 9 మంది టీచర్లు ఉండాలి. విద్యార్థుల సంఖ్య 200 దాటిన ప్రతి ఉన్నత పాఠశాలలోనూ ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ను కేటాయించింది.