న్యూఢిల్లీ : జెఎన్యు మాజీ ప్రొఫెసర్ జయతి ఘోష్ గ్లోబల్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్లో ప్రతిష్టాత్మక జెకె గాల్బ్రైత్ అవార్డును మంగళవారం స్వీకరించారు. ఈ ఏడాదికి గాను ప్రతిష్టాత్మక పెన్ /జెకె గాల్బ్రైత్ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఈ ఏడాది మార్చిలో అగ్రికల్చరల్ అండ్ అప్లైడ్ ఎకనామిక్స్ అసోసియేషన్ (ఎఎఇఎ) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్థిక శాస్త్రంలో మెరుగైన ఆవిష్కరణలు, పరిశోధన, సేవల ద్వారా మానవాళికి చేసిన విశిష్ట సహకారానికి గుర్తింపుగా ఈ అవార్డు ఆమెను వరించినట్లు అవార్డ్ కమిటీ ఎఎఇఎ పేర్కొంది. జయతీఘోష్ ప్రస్తుతం యూనివర్శిటీ ఆఫ్ మసాచుసెట్స్ అమ్హోర్ట్స్లో ప్రొఫెసర్గా ఉన్నారు. పరిశోధన, విద్య, ప్రజాసేవలో విజయాలను సాధించిన వారిని కెనడియన్ ఆర్థికవేత్త జాన్ కెన్నెత్ గాలబ్రైత్ పేరు మీద ఈ అవార్డుతో సత్కరిస్తుంటారు. ఘోష్ గతేడాది ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ స్థాపించిన 'ఎఫెక్టివ్ మల్టీలెటరలిజం' పై ఉన్నత స్థాయి సలహా మండలిలోనూ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఆమె కార్మికులు, మహిళలు, ఆర్థిక శాస్త్ర అభివఅద్ధిపై అనేక వ్యాసాలు, 20కి పైగా పుస్తకాలను రచించారు. 2023-24 బడ్జెట్లో సామాజిక వ్యయం మరియు గ్రామీణ పేదలపై చోటు కల్పించలేదని విమర్శనాత్మకంగా రాశారు.










