Jun 26,2022 06:52

ప్రభుత్వంలో భాగస్వాములైన ఎన్‌సిపి, కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నట్టు ఇది శివసేనలో పుట్టిన ముసలం. భాగస్వామ్య పక్షాలు గట్టిగానే వుండగా మన వాళ్లే మనకు ద్రోహం చేసిన ఫలితమిది అని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే చేసిన వ్యాఖ్య వాస్తవమే. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాల కూల్చివేత ఫిరాయింపుల క్రీడలో ఆరితేరిన బిజెపి ప్రత్యక్ష మద్దతుతోనే ఈ పరిస్థితి వచ్చిందనేది మరింత నిజం. 2014లో మోడీ అధికారం చేపట్టిన తర్వాత ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టిన జాబితా చాలా పెద్దదే. అరుణాచల్‌ ప్రదేశ్‌తో మొదలై బీహార్‌, మధ్యప్రదేశ్‌, మణిపూర్‌, గోవా, కర్ణాటక, ఉత్తరాఖండ్‌, జమ్మూ కాశ్మీర్‌లలో బిజెపి ప్రత్యక్ష పాత్ర, పరోక్ష కుట్రలతో సర్కార్లు కూలాయి. మహారాష్ట్ర ఈ ప్రక్రియలో తాజా ఘట్టం.

హారాష్ట్రలో రెండున్నరేళ్లుగా పాలన చేస్తున్న మహా వికాస్‌ అఘాడీ (ఎం.వి.ఎ) ప్రభుత్వ సంక్షోభం అయిదు రోజులుగా సాగుతున్నది. రాష్ట్రపతి ఎన్నికలపై వుండాల్సిన దేశం దృష్టి ఆ రాష్ట్రం వైపే కేంద్రీకృతమైంది. బిజెపితో చేతులు కలిపి శివసేన నేత ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం నుంచి నిష్క్రమించిన మంత్రి ఏక్‌నాథ్‌ షిండే తనతో 40 మంది ఎంఎల్‌ఎలు వున్నారని చెబుతున్నారు. శివసేన మొత్తం బలం 56లో ఇది 2/3 వంతుల కంటే ఎక్కువే వుంది గనక ప్రభుత్వ పతనం తప్పదని అంతా భావించారు. రాజకీయ లెక్కలు, ఫిరాయింపు చట్టం నిబంధనలు, కేంద్ర బిజెపి వ్యూహాలు, కోర్టుల జోక్యాలు వీటన్నిటి దృష్ట్యా ఇది మరికొన్ని రోజులు పరిష్కారం కాకపోవచ్చు. ప్రభుత్వంలో భాగస్వాములైన ఎన్‌సిపి, కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నట్టు ఇది శివసేనలో పుట్టిన ముసలం. భాగస్వామ్య పక్షాలు గట్టిగానే వుండగా మన వాళ్లే మనకు ద్రోహం చేసిన ఫలితమిది అని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే చేసిన వ్యాఖ్య వాస్తవమే. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాల కూల్చివేత ఫిరాయింపుల క్రీడలో ఆరితేరిన బిజెపి ప్రత్యక్ష మద్దతుతోనే ఈ పరిస్థితి వచ్చిందనేది మరింత నిజం. 2014లో మోడీ అధికారం చేపట్టిన తర్వాత ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టిన జాబితా చాలా పెద్దదే. అరుణాచల్‌ ప్రదేశ్‌తో మొదలై బీహార్‌, మధ్యప్రదేశ్‌, మణిపూర్‌, గోవా, కర్ణాటక, ఉత్తరాఖండ్‌, జమ్మూ కాశ్మీర్‌లలో బిజెపి ప్రత్యక్ష పాత్ర, పరోక్ష కుట్రలతో సర్కార్లు కూలాయి. మహారాష్ట్ర ఈ ప్రక్రియలో తాజా ఘట్టం.
 

                                                    మహారాష్ట్రలో బిజెపి కుయుక్తులు

మహారాష్ట్రలో శివసేన తన సహజ నేస్తమని బిజెపి చెబుతుండేది. సేన అధినేతగా బాల్‌ ఠాక్రే వున్నంత కాలం బిజెపి అగ్రనేతలు ఆయన చుట్టూనే తిరిగేవారు. మధ్యమధ్యలో ఆయన అలిగితే అద్వానీ వంటి వారు వెళ్లి బుజ్జగించి వచ్చేవారు. ఆయన హయాంలో ముఖ్యమంత్రిగా శివసేనకు చెందినవారే వుండటం వారిని కూడా ఠాక్రే రిమోట్‌తో పాలిస్తానని చెప్పడం పరిపాటి. కానీ తర్వాత 2014లో విడిగానే పోటీ చేసింది. దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిని చేసింది. శివసేన ఈ ప్రభుత్వానికి దూరంగా వుండిపోయింది. చాలాకాలం తర్వాత గాని మళ్లీ చేతులు కలిపింది. 2019 ఎన్నికల తర్వాత శివసేన ముఖ్యమంత్రి పదవి తమకే రావాలని షరతు పెట్టగా బిజెపి ససేమిరా ఒప్పుకోలేదు. ఆ దశలో ఎన్‌సిపి నేత శరద్‌ పవార్‌ మంత్రాంగం ఫలించి కాంగ్రెస్‌ను కూడా కలుపుకుని ఎంవిఎ ఏర్పడింది. కేంద్రంలోని సేన మంత్రులు కూడా వైదొలగారు. ఎన్‌డిఎ కూటమిలో అతి పెద్ద గండి అది. అధికారానికి తిరిగి వచ్చిన మోడీకి రాజకీయ దెబ్బ. ఈ కూటమికి పూర్తి ఆధిక్యత వున్నా ప్రభుత్వ స్థాపనకు ఆహ్వానించలేదు గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారి. పైగా ఈ లోపలే రహస్యంగా తెల్లవారుజామున దేవేంద్ర ఫడ్నవీస్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. పవార్‌ తమ్ముని కుమారుడు, రాజకీయ వారసుడైన అజిత్‌ పవార్‌ ఆ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరడం మరో సంచలనమైంది. ఒకసారి అధికారంలోకి వచ్చేస్తే శివసేన లేదా ఇతర పక్షాల నుంచి ఎంఎల్‌ఎలు వచ్చేస్తారని ఆశపడినా అది జరగదని తేలిపోయింది. అవమానకరంగా ఫడ్నవీస్‌ నిష్క్రమించాల్సి వచ్చింది. ఇక ఎంవిఎ ప్రమాణ స్వీకారమే తరువాయి అని భావిస్తున్న దశలో ఆరుగురు ఎన్‌సిపి ఎంఎల్‌ఎలు కనిపించకుండా పోయారు. ఢిల్లీలో బిజెపి నేతలకు దగ్గరగా వుండే ఒక హోటల్‌లో ప్రత్యక్షమయ్యారు. అజిత్‌ పవార్‌ తిరిగి ఇటువైపు రావడం వాటిలో ఒకటి. వీటన్నిటినీ దాటుకుని ఏర్పడిన ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వంతో కేంద్రం నిరంతరం ఘర్షణ పడుతూనే వుంది. అక్కడి పోలీసు అధికారులు మంత్రులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎప్పుడూ ఏవో కేసులు, అరెస్టులు చేస్తూనే వున్నాయి. అనేక వివాదాలు, బెదిరింపులు, ఘర్షణలు కరోనా లోనూ వెంటాడాయి. ఆర్నబ్‌ గోస్వామి అరెస్టు, ఆయనకు అమిత్‌ షా మద్దతు వాటిలో భాగమే. దేశ ఆర్థిక రాజధాని, మాఫియాలకు నిలయమైన ముంబాయిలో ఇలాంటి నాటకీయ పరిణామాలు సర్వసాధారణం.
 

                                                           సేనలో లుకలుకలు

ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ పద్ధతులు పాటిస్తున్నా తమ పార్టీ నేతలకు భాగస్వామ్య పక్షాలకు అందుబాటులో వుండటం లేదనే విమర్శలూ వున్నాయి. శివసేన కన్నా ఎన్‌సిపి ఎక్కువ అధికారం చలాయిస్తుందనేది వారి ప్రధాన ఫిర్యాదు. కీలక శాఖలు ఎక్కువగా ఎన్‌సిపి చేతుల్లోనే వుండటం ఇందుకు కారణమైంది. ఇప్పుడు తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఏక్‌నాథ్‌ షిండే కూడా ఆ విధంగా కీలక శాఖ కోల్పోయారంటారు. నాలుగు సార్లు ఎంఎల్‌ఎగా ఎన్నికై మంత్రివర్గం లోనూ ముఖ్యుడుగా వున్న షిండే పార్టీలో రెండవ స్థానంలో నేతగా చలామణి అయ్యారు. ఉద్ధవ్‌ శాసనసభలో లేరు గనక అక్కడ సేన సభా నాయకుడు గానూ నియమితులయ్యారు. అయితే ఉద్ధవ్‌ కుమారుడైన ఆదిత్య ఠాక్రే ప్రాబల్యం పెంచుకోవడం ఆయనకు మింగుడు పడలేదు. ఉద్ధవ్‌ తర్వాత కూడా తనకు నాయకత్వం రాదని గ్రహించిన షిండే తెర వెనక రాజకీయాలు నడిపారు. ఇటీవల జరిగిన రాజ్యసభ, శాసనమండలి ఎన్నికల్లో పాలక కూటమి దెబ్బతిన్నది. అయిదో రాజ్యసభ స్థానం బిజెపి గెలుచుకోగలిగింది. శాసనమండలి ఎన్నికల్లోనూ ఆరుగురు అభ్యర్థులను పెడితే ఒకరు ఓడిపోయారు. మరో వంక బిజెపి బలాన్ని మించి అయిదూ గెల్చుకుంది. క్రాస్‌ ఓటింగ్‌ కనిపిస్తున్నా ఠాక్రే పరిస్థితి అర్థం చేసుకోకపోగా అసంతృప్తులతో చర్చలు జరిపే బాధ్యత షిండేకే అప్పగించారు. ఇక మంత్రి హోదాలో ఆయన నేరుగా దేవేంద్ర ఫడ్నవీస్‌ తోనే చాంబర్‌లో చర్చలు జరపడం అందరికీ తెలిసిన విషయమే. ఈ కాలమంతటా బిజెపి నేతలు గాని షిండేగాని పరస్పర విమర్శలే చేసుకోకపోవడం వారి బంధానికి నిదర్శనం. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న ఉద్ధవ్‌ అయిదు నెలలుగా అధికార కార్యాలయానికి హాజరు కాలేదు. ఆ సమయంలోనే షిండే అసమ్మతి వాదులను కూడగట్టగలిగారు.
 

                                                           నేరుగా గుజరాత్‌కు...

ఈ వారం మొదట్లో హఠాత్తుగా అదృశ్యమైన షిండే గుజరాత్‌ లోని సూరత్‌లో తేలారు. ఈ పరిణామాలతో తమకేమీ సంబంధం లేదని బిజెపి చెబుతున్నా ఆయన తన శిబిరం కోసం మోడీ మూల పీఠమైన గుజరాత్‌ ఎంచుకోవడం యాదృచ్ఛికం కాదు. ఆ తర్వాత వారి పాలనలోని మరో రాష్ట్రం అస్సాం వెళ్లారు. ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో బసచేశారు. ఆయనతో మొదట 20 మంది వున్నారని తర్వాత ఆ సంఖ్య 40 వరకూ పెంచారు, వాస్తవంగా ఎంతమంది వున్నారనేది పరీక్ష లోనే తేలాలి. మామూలుగా తిరుగుబాటు చేసిన లేదా ఫిరాయించిన ఎంఎల్‌ఎలు తాము ముఖ్యమంత్రులం కావాలని కోరుకుంటారు. అందుకు భిన్నంగా షిండే ఎంవిఎను విడనాడి బిజెపితో కలవాలని షరతు పెట్టారు. అప్పటికే సభాపక్ష నాయకుడుగా ఆయనను తొలగించిన శివసేన మీరు తిరిగివస్తే పరిశీలిస్తామని చెప్పింది. ఈలోగా ఠాక్రే రాజీనామాకు సిద్ధమేనని ప్రకటించి అధికార కార్యాలయం ఖాళీ చేసి స్వగృహానికి తరలిపోయారు. మొదట 12, తర్వాత పదహారు మంది షిండే వర్గీయులను అనర్హులుగా ప్రకటించాలని డిప్యూటీ స్పీకర్‌ను కోరింది. ఆయన వారికి నోటీసు ఇస్తారని అనుకుంటున్నారు. నోటీసు వస్తే స్పందిస్తామని షిండే చెబుతున్నారు. కాంగ్రెస్‌కు చెందిన స్పీకర్‌ అస్వస్థులుగా వుండటంతో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్‌ నరహరి జిర్వాల్‌ వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఆయన సేనకు అనుకూలమే గనక అనర్హత ప్రకటించే అవకాశం ఎక్కువ. అనర్హత వేటుకు గురైతే బలాబలాలు మారతాయి. ఈలోగానే కోర్టులకు వెళ్లడం, స్టేలు తెచ్చుకోవడం వంటివి జరుగుతాయి.
 

                                                         సాంకేతిక రాజకీయ సవాళ్లు

శాసనసభా పార్టీలో మూడింట రెండు వంతుల మంది తిరుగుబాటు చేస్తే అనర్హత వర్తించదు. అయితే వారు మరో పార్టీలో విలీనం కావలసి వుంటుంది. వారిని వేరే గ్రూపుగా గుర్తించడం లేదా అసలైన పార్టీగా పరిగణించడం అన్నది ఎన్నికల కమిషన్‌ చేయవలసిన పని. అందుకు సమయం పడుతుంది. ఇప్పటి వరకూ జరిగిన దాన్ని బట్టి వారు బిజెపిలో లీనం అయ్యే అవకాశం ఎక్కువే. అయితే బిజెపి మాత్రం ఇది సేన అంతర్గత వ్యవహారమనీ తమ పాత్ర లేదనీ ప్రభుత్వ స్థాపన కోసం అడగలేదనీ చెబుతోంది. 105 మంది సభ్యులున్న బిజెపి ఇండిపెండెంట్ల మద్దతు షిండే వర్గం కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. తర్వాత వారితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు తెచ్చే విధంగా కర్ణాటక లోనూ ఎం.పి లోనూ అనుసరించిన పాత ఎత్తుగడ ఇక్కడా పునరావృతం కావచ్చు. ఈలోగా షిండే తమ మద్దతు ఉపసంహరించాము గనక సభ లోపల పరీక్ష జరపాలని కోరాల్సి వుంటుంది. ఇవన్నీ ఎలా జరిగినా ఉద్ధవ్‌కు వారు మద్దతు ఇవ్వరనేది స్పష్టమే. అప్పుడు కూటమిలో ఎన్‌సిపి పెద్ద పార్టీ అవుతుంది. వారు నాయకత్వం తమకు రావాలని అడుగుతారా అనే ఊహాగానాలు కూడా వున్నాయి. గవర్నర్‌ కోషియారి ఆది నుంచి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వుంటున్నారు. ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రవర్తించడం జరిగేది కాదు. కనుక మహారాష్ట్ర సంక్షోభం క్లైమాక్స్‌ కేంద్రం వ్యూహం పైన, కోర్టుల ఆదేశాలపైన ఆధారపడి వుంటుంది. బలాబలాల పరీక్ష శాసనసభ వేదిక పైనే జరగాలన్న బొమ్మై కేసు తీర్పు ఇక్కడ శిరోధార్యం. దేశ ప్రజలూ రాజకీయ పక్షాలూ బిజెపి నీతి బాహ్య నిరంకుశ పోకడల తీవ్రత తెలుసుకోవడానికి మహారాష్ట్ర సంక్షోభం తాజా ఉదాహరణగా నిలుస్తుంది.

తెలకపల్లి రవి

తెలకపల్లి రవి