Jun 20,2023 09:41
  • 2014, 2019 ఎన్నికల ఫలితాలపై ప్రతిపక్షాలు
  • మోడీ మ్యాజిక్‌ ఇప్పుడు పనిచేయదని వ్యాఖ్య

న్యూఢిల్లీ : 2014, 2019 లోక్‌సభ ఎన్నికలలో బిజెపి సాధించిన విజయాలను లోతుగా పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2019 ఎన్నికలలో బిజెపి 105 స్థానాలలో మూడు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. 2014 ఎన్నికలలో సాధించిన స్థానాల కంటే 2019లో ఆ పార్టీకి 63 సీట్లు అధికంగా వచ్చాయి. ఇదంతా బిజెపి ప్రభంజనమే అని చెప్పడానికి ఏ మాత్రం వీలు లేదు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోవడం వల్లనే బిజెపి ఆ విజయాలను సొంతం చేసుకోగలిగంది. 2024 ఎన్నికలలో ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన ఆవశ్యకతను ఈ గణాంకాలు చాటిచెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 23న 18 ప్రతిపక్ష పార్టీలు పాట్నాలో సమావేశమవుతున్నాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని మట్టి కరిపించేందుకు ఓ సంఘటిత వ్యూహాన్ని రూపొందించే ప్రయత్నం చేయబోతున్నాయి.
           2019 లోక్‌సభ ఎన్నికలలో 236 మంది అభ్యర్థులు రెండు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. వీరిలో 164 మంది బిజెపికి చెందిన వారు. మూడు లక్షలకు పైగా మెజారిటీతో గెలుపొందిన 131 మందిలో నూట ఐదుగురు బిజెపి వారే. మిగిలిన 26 మందిలో 10 మంది డిఎంకెకు, ఐదుగురు కాంగ్రెస్‌కు చెందిన వారు ఉన్నారు. బిజెపికి ప్రధాన ప్రత్యర్థిగా నిలిచిన కాంగ్రెస్‌ పార్టీ ఓట్ల శాతం 2014, 2019 ఎన్నికలలో సమానంగానే ఉంది. అయితే బిజెపి ఓట్ల శాతం పెరిగింది. 2014 ఎన్నికలలో బిజెపికి 31 శాతం ఓట్లు, 282 సీట్లు వస్తే 2019లో 37 శాతం ఓట్లు, 303 సీట్లు లభించాయి. ఈ రెండు ఎన్నికలలోనూ రాజస్థాన్‌, ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలలో బిజెపి ఘన విజయాలు సాధించింది. మూడు లక్షలకు పైగా బిజెపి మెజారిటీ వచ్చిన స్థానాలు కూడా ఈ రాష్ట్రాలలో ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే బిజెపి ఓట్ల శాతం పెరిగినా ఆ దామాషాలో సీట్లు పెరగలేదు.
          బిజెపి సాధించిన ఈ భారీ ఆధిక్యతలు చూసి ప్రతిపక్షాలు పెద్దగా కలవరపడాల్సిన అవసరం లేదని ప్రొఫెసర్‌, లోక్‌నీతి సంస్థ సమన్వయకర్త సంజరు కుమార్‌ అభిప్రాయపడ్డారు. 2014, 2019 ఎన్నికలలో బిజెపి పనితీరు 2024 ఎన్నికల ఫలితాలపై ఎలాంటి సంకేతాన్ని ఇవ్వడం లేదని ఆయన చెప్పారు. ఎందుకంటే ప్రతి ఎన్నిక భిన్నంగా ఉంటుందని, ప్రస్తావనకు వచ్చే అంశాలు కూడా వేర్వేరుగానే ఉంటాయని తెలిపారు. భాగస్వామ్య పక్షాలు మారుతుంటాయని గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయి. బిజెపి అభ్యర్థులు సాధించిన భారీ ఆధిక్యతలు 2024 ఎన్నికలపై ప్రభావం చూపబోవని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. అదంతా బలుపేనని వ్యాఖ్యానించాయి. మోడీ మ్యాజిక్‌ ఇప్పుడు పనిచేయదని తెలిపాయి. గత ఎన్నికల ఫలితాల గణాంకాలు విశ్లేషిస్తూ కూర్చోవడం నిష్ప్రయోజనమని కాంగ్రెస్‌ డాటా ఎనలిటిక్స్‌ విభాగం ఛైర్మన్‌ ప్రవీణ్‌ చక్రవర్తి చెప్పారు. అది భారీ మెజారిటీ ఎలా అవుతుందని చక్రవర్తి ప్రశ్నించారు. 'నలభై శాతం కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోవడం ముఖ్యం. 2014తో పోలిస్తే 2019లో బిజెపికి అధిక స్థానాలు వచ్చాయన్నది వాస్తవం. అయితే గతమెంతో ఘనకీర్తి అని చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ద్రవ్య మార్కెట్లు సైతం ఇదే సూత్రాన్ని పాటిస్తాయి' అని తెలిపారు.
            2014, 2019 ఎన్నికలలో ప్రజల ఆలోచన ఒకేలా ఉందని, అందుకే ఆ అజెండాకు ఓటేశారని సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధి ఘనశ్యామ్‌ తివారీ చెప్పారు. ఆ ఎన్నికలలో అభ్యర్థులు నిమిత్తమాత్రులని, అంతా మోడీ మాయాజాలం నడిచిందని తెలిపారు. ఆనాడు బిజెపి అభ్యర్థులు సాధించిన భారీ మెజారిటీలు వారి సొంత బలంపై తెచ్చుకున్నవి కావని గుర్తు చేశారు. అభ్యర్థులు తమ సొంత బలంపై ఓట్లు సాధిస్తే దానిని పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. 2014, 2019 ఎన్నికల ఆధారంగా 2024 ఎన్నికలు జరగబోవని తివారీ స్పష్టం చేశారు. 2024 ఎన్నికలకు సొంత అజెండా ఉందని చెప్పారు. బిజెపికి ప్రస్తుతం అజెండా అంటూ ఏదీ లేదని, అది ప్రజల మనసుల్లో లేని అజెండాను చొప్పించి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని విమర్శించారు. ఏ పార్టీకి ఓటేయాలో ప్రజలు మానసికంగా ఇప్పటికే నిర్ణయించుకున్నారని, సమయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు.
         2019లో పరిస్థితులు వేరుగా ఉన్నాయని, అప్పుడు పుల్వామా దాడి జరిగిందని మాజీ ఎంపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి కీర్తి ఆజాద్‌ అన్నారు. ఇప్పుడు ప్రజలకు తెలిసి వచ్చిందని, బిజెపి ప్రచారం శుష్క వాగ్దానాలు, మతోన్మాద చర్యలపై ఆధారపడి ఉందన్న విషయం వారికి అర్థమైందని ఆయన చెప్పారు.