Jun 26,2022 10:39

భారతీయ రైల్వేకు ఇదో గర్వకారణం.. ఎన్నో అడ్డకుంలను.. కష్టాలను అధిగమించి క్లిష్టతరమైన 'ఐరన్‌ మ్యాన్‌ ట్రయాథ్లాన్‌' ను పూర్తిచేసిన మొదటి అధికారిగా చరిత్ర సృష్టించాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన సింగిల్‌-డే స్పోర్ట్స్‌ ఈవెంట్‌గా గుర్తింపు పొందింది. కాగా ఇందులో అత్యంత కఠినమైన మూడు సవాళ్లను ఒక్క రోజులో పూర్తిచేయాలి. ఏటా నిర్వహించే ఈవెంట్‌ ఈసారి జర్మనీలోని హాంబర్గ్‌లో నిర్వహించారు. ఇందులో మనదేశానికి చెందిన హోసూర్‌ కేవలం 13 గంటల 26 నిమిషాల్లో పూర్తిచేసి, రికార్డు సృష్టించాడు.

Hosur


ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన క్రీడల్లో ఒకటిగా 'ఐరన్‌మ్యాన్‌ ట్రయాథ్లాన్‌' కు పేరు ఉంది. కాగా ఈ ఆటలోని మూడు సవాళ్లను కేవలం 17 గంటల్లోనే పూర్తిచేయాల్సి ఉంటుంది. ఉదయం ఏడు గంటలకు మొదలయ్యే ట్రయాథ్లాన్‌లో తొలి దశలో స్విమ్మింగ్‌ను ఉదయం 9.20 ని.లకు పూర్తిచేయాలి. ఆ తర్వాత సైక్లింగ్‌ను సాయంత్రం 5.30 ని.లకు (8 గంటల 10 నిమిషాల్లో) పూర్తిచేసి, మారథాన్‌ను మొదలుపెట్టాలి. అర్ధరాత్రి 12 కల్లా (6 గంటల 30 నిమిషాల్లో) దీన్ని కూడా ముగించాలి. ఇలా మూడు దశలను వేగంగా ముగించిన వారే ఐరన్‌మ్యాన్‌ టైటిల్‌ను అందుకుంటారు. ఏటా జరిగే ఈ పోటీలను ఈసారి జర్మనీలోని హాంబర్గ్‌ వేదికగా నిర్వహించగా, బెంగళూరుకు చెందిన హోసూర్‌ 13 గంటల 23 నిమిషాల 36 సెకన్లలో విజయవంతంగా పూర్తిచేసి, చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. చాలా మందికి అసాధ్యమని అనిపించే పనిని పూర్తిచేసి, 'ట్రయాథ్లాన్‌' విజేతగా నిలిచాడు. భారతీయ రైల్వే నుంచి శ్రేయాస్‌కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
అత్యంత క్లిష్టమైన క్రీడలు..
ప్రపంచంలోనే క్లిష్టమైన క్రీడల్లో ఒకటి 'ట్రయాథ్లాన్‌'. ఇందులో స్విమ్మింగ్‌, సైక్లింగ్‌తో పాటు రన్నింగ్‌ కూడా చేయాల్సి ఉంటుంది.ఈ మేరకు 1.5 కిలోమీటర్ల దూరం స్విమ్మింగ్‌, 40 కిలోమీటర్ల సైక్లింగ్‌, 10 కిలోమీటర్ల పరుగు పూర్తిచేసిన వారే విజేతలుగా నిలుస్తారు. ఇదే కష్టసాధ్యమైన పోటీ అనుకుంటే దీన్ని మించిన గేమ్‌ 'ఐరన్‌మ్యాన్‌ ట్రయాథ్లాన్‌'. వరల్డ్‌ ట్రయాథ్లాన్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరిగే ఐరన్‌మ్యాన్‌ ట్రయాథ్లాన్‌లో పాల్గొనే అథ్లెట్లు 3.86 కిలోమీటర్లు స్విమ్మింగ్‌ చేసి, ఆ తర్వాత 180.25 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కాలి. ఆ వెంటనే 42.2 కిలోమీటర్ల మారథాన్‌ను పూర్తిచేయాలి. కాగా ఈ ఆటలో విజేతగా నిలిచి, చరిత్ర సృష్టించాడు. బెంగళూరు రైల్వే ఉద్యోగి శ్రేయాస్‌ హోసూర్‌.
రికార్డ్‌ బ్రేక్‌ చేస్తూ..
34 ఏళ్ల సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే డిప్యూటీ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌గా పనిచేస్తున్న హోసూర్‌, ఈ గేమ్‌ను పూర్తిచేసిన మొదటి భారతీయ రైల్వే అధికారిగా రికార్డ్‌ బ్రేక్‌ చేశాడు. ఈ ఈవెంట్‌కు ముందు దాదాపు నాలుగు నుంచి ఐదు ఒలింపిక్‌ ట్రయాథ్లాన్స్‌ సహా నాలుగు హాఫ్‌-ఐరన్‌ డిస్టెన్స్‌ ట్రయాథ్లాన్స్‌లో పాల్గొన్నాడు శ్రేయాస్‌. 2012 బ్యాచ్‌ సివిల్‌ సర్వెంట్‌ అయిన హోసూర్‌ ప్రస్తుతం బెంగళూరు రైల్వేలో విధులు నిర్వర్తిస్తున్నాడు. గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ను పట్టుకున్న బృందంలో భాగమైన రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారి గోపాల్‌ బి హోసూర్‌ కుమారుడని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని శ్రేయాస్‌ బార్డర్‌ లైన్‌ను క్రాస్‌ చేస్తున్న క్లిప్‌ను రైల్వే మంత్రిత్వ శాఖ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. కేంద్ర రైల్వే, బొగ్గు, గనుల శాఖ సహాయమంత్రి రావుసాహెబ్‌ పాటిల్‌ దన్వే కూడా క్లిప్‌ను షేర్‌ చేసి, విజేతను అభినందించాడు.
అన్నింటినీ తట్టుకోవాలి..
జర్మనీలో వాతావరణం భిన్నంగా ఉంటుంది. చాలా అనిశ్చితులు ఉంటాయి. ఒకానొక సమయంలో వదులుకోవాలని అనిపించిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ అవేవీ పట్టించుకోకుండా లక్ష్యంపైనే మనసు నిలపాలి. ఈవెంట్‌కి చాలా ఓర్పు, బలం అవసరం. ఒక్కసారి గేమ్‌ ప్రారంభించిన తర్వాత గాయమైనా లేదా బైక్‌ రిపేర్‌ అయినా ఏ అడ్డంకులు వచ్చినా అన్నింటినీ తట్టుకుని, ముందుకు సాగాలి.
ఐరన్‌మ్యాన్‌ ట్రయాథ్లాన్‌ కోసం దాదాపు మూడేళ్లపాటు కష్టపడ్డాను. ఈవెంట్‌కు సిద్ధం కావడానికి నాకు సహాయం చేసిన భారత ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కోచ్‌ సోమ్యా రౌత్‌కు కృతజ్ఞతలు. అతడి వద్ద సుమారు ఒకటిన్నర ఏళ్లు శిక్షణ పొందాను. కష్టాలను ఎదుర్కొనేలా ఆయన చెప్పిన విలువైన విషయాలు ఈవెంట్‌ సమయంలో ఉపయోగపడ్డాయి. శరీరం గాయాలకు ఎలా స్పందిస్తుందో తెలుసుకున్నాను.