Nov 08,2022 07:09

కుటుంబంలో లోపాలు ఉంటే సర్దుకు పోవాలి. ఎవరైనా పరువును బజారుకు ఈడుస్తారా? అలాగే దేశం గురించి వేలెత్తి చూపే విధంగా విదేశాలకు అవకాశమిచ్చే రీతిలో ప్రవర్తించవచ్చా? అంటూ కమల నాథులు కలవరపడు తున్నారు. దేశాన్ని బదనాం చేస్తున్నారని నిందిస్తున్నారు. నిజమే, ఎవరు ఏ సందర్భంలో ఎందుకు చెప్పినా ఇప్పుడిది ఆలోచించాల్సిన అంశమే. అయితే ఈ సుభాషితం ముందుగా ఎవరికి వర్తింపచేయాలి? ఎవరు పాటించాలి? భారతీయులందరూ ఆలోచించాల్సిన అంశం. తమ మీద విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని ముస్లింలు విమర్శిస్తుండగా, ఈ మతం వారు తమ మతం మీద జీహాద్‌ ప్రకటించారని హిందూ మత పెద్దలుగా చెప్పుకొనే వారు ప్రతి ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం మీద భారత్‌ అంటే మధ్య యుగాల నాటి మతవిద్వేష భూమిగా ప్రపంచం భావించేట్లు చేస్తున్నారనే భావం రోజు రోజుకూ పెరుగుతోంది.
        ఇటువంటి స్థితిలో 2022 అక్టోబరు 21న సుప్రీం కోర్టు చరిత్రలో ఒక కొత్త అధ్యాయం తోడైంది. దాఖలైన ఒక కేసు ఏమవుతుంది అన్నది పక్కన పెడితే కోర్టు చేసిన పరిశీలన ఎంతో కీలకమైనది. న్యాయమూర్తులు కెఎం జోసెఫ్‌, హృషికేష్‌ రారు బెంచ్‌ 'ఇది 21వ శతాబ్దం, మనం దేవుడిని ఎంతకు దిగజార్చాము? మనకు శాస్త్రీయ దృష్టి ఉండాలని ఆర్టికల్‌ 51 చెబుతున్నది. మతం పేరుతో జరుగుతున్నదేమిటి? ఇది విషాదం' అని చెప్పింది. మతం తటస్థంగా ఉండే దేశంలో విద్వేష వాతావరణం ఉందంటూ సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తాము చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఆదేశాలు ఇస్లాంకు వ్యతిరేకంగా చేసిన ద్వేష పూరిత ప్రసంగాలకు మాత్రమే పరిమితం కాదని, ఏ మతానికి వ్యతిరేకంగా ఎవరు చేసిన వాటికైనా వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ పోలీసు అధికారులు అలాంటి ద్వేష పూరిత ప్రసంగాలను ఏ మతం వారు చేసినప్పటికీ వాటి గురించి ఎవరూ ఫిర్యాదు చేసినా, చేయకున్నా స్వంతంగా కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలు పాటించకుంటే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మూడు రాష్ట్రాల్లో ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన ద్వేష పూరిత ప్రసంగాల గురించి జర్నలిస్టు షాహిన్‌ అబ్దుల్లా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆర్టికల్‌ 51(ఏ) ప్రకారం ప్రతి ఒక్కరూ మౌలిక విధుల్లో భాగంగా శాస్త్రీయ దృష్టి, మానవత్వం, పరిశీలన, సంస్కరణ దృక్పధాన్ని పాటించాలని, భారత్‌ ఒక లౌకిక దేశంగా రాజ్యాంగం ఆలోచించిందని, భిన్న మతాలు, కులాలకు చెందిన వారు సామరస్య పూర్వకంగా జీవించకుంటే ప్రజల్లో ఇక సోదరభావమనేదే ఉండదని కోర్టు పేర్కొన్నది.
      సుప్రీం కోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచ జనావళిని, విశ్లేషకులను ఆకర్షించకుండా ఉంటాయా? మన పత్రికలను చదవరా, టీవీలను చూడరా? ఇప్పటికే విద్వేష ప్రసంగాలు మన దేశానికి పెద్ద మరకను అంటించాయి. దీనికి కారకులు ఎవరు అంటే మెజారిటీ, మైనారిటీ మతాలకు చెందిన ఓటు బ్యాంకు పార్టీలు, నేతలు, కుట్రదారులు, ఉన్మాదులు, వారి ప్రభావానికి లోనై తప్పుదారి పట్టినవారు తప్ప సామాన్య ప్రజలు కాదు. విద్వేష వాతావరణం ఏర్పడటానికి ఎవరిది ఎంత భాగం అంటే జనాభాలో ఎవరి వాటా ఎంత ఉంటే అంత అన్నది స్పష్టం. ఫిర్యాదును చూస్తుంటే దేశంలో విద్వేష వాతావరణం వ్యాపించినట్లు కనిపిస్తోందని కోర్టు పేర్కొన్నది. పిటీషనర్‌ తరఫున న్యాయవాది కపిల్‌ సిబాల్‌ వాదిస్తూ విద్వేష ప్రసంగాల గురించి ఇప్పటికే సుప్రీం కోర్టు ముందు కేసులున్నాయని, నిరోధ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ అక్టోబరు తొమ్మిదిన ఢిల్లీలో జరిగిన ఒక సభలో ముస్లింల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టినందున కోర్టును ఆశ్రయించినట్లు సిబాల్‌ చెప్పారు. ఢిల్లీలో ముస్లింలు చేసినట్లుగా చెబుతున్న ఒక హత్య గురించి విశ్వహిందూ పరిషత్‌ ఏర్పాటు చేసిన జన్‌ ఆక్రోశ్‌ నిరసన సభలో ఎంపీ పర్వేష్‌ సాహిబ్‌ సింగ్‌ వర్మ ప్రసంగిస్తూ పేరు ప్రస్తావించకుండానే ముస్లింలను సాంఘికంగా బహిష్కరించాలని పిలుపు ఇచ్చినట్లు దరఖాస్తుదారు పేర్కొన్నారు. పిటీషన్‌పై వాద ప్రతివాదనల సందర్భంగా అలాంటి పిలుపులు హిందువులకు వ్యతిరేకంగా కూడా ఇస్తున్నారని, ఉభయ పక్షాలు అందుకు పాల్పడుతున్నట్లు కోర్టు పేర్కొన్నది. ముస్లింలు కూడా విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు కదా! అని పేర్కొన్నది. దాని మీద సిబాల్‌ స్పందిస్తూ వారిని మినహాయించాలని అనుకుంటున్నారా? ఎవరు అలాంటి విద్వేష ప్రసంగాలు చేసినా సహించకూడదు అని చెప్పారు. ఒక సామాజిక తరగతికి వ్యతిరేకంగా ఒక తరహా ప్రకటనను నొక్కి వక్కాణించాలని తాము చూడటం లేదని, తమకు ఆ సంగతి తెలుసునని కోర్టు పేర్కొన్నది. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో బిజెపి అధికారంలో ఉంది. ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పాలన ఉన్నా పోలీసులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటారు. ఇక్కడ జరుగుతున్న విద్వేష ప్రసంగాలు జనాభా దామాషా ప్రకారం చూసినా హిందూ ఉన్మాదులు చేస్తున్నవే ఎక్కువ. విద్వేష ప్రసంగాలపై ఎవరూ ఫిర్యాదులు చేయకున్నా పోలీసులు తమకు తామే కేసులు నమోదు చేయాలని దేశ సర్వోన్నత కోర్టు చెప్పిందంటే మన దేశంలో ఉన్న పరిస్థితి గురించి వేరొకరెవరో వేలెత్తి చూపాల్సిన అవసరం ఉందా? గతంలో అధికారంలో ఉన్న పార్టీలు లేదా ప్రభుత్వాలకు ఇలాంటి ఆదేశాలు ఎన్నడైనా జారీ చేసిన ఉదంతం ఉందా? ఎవరు సమాధానం చెబుతారు! ఇలాంటి పరిస్థితి రావటం మెజారిటీ రాష్ట్రాల్లో, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ని అభిశంసించటమే.
      దేశంలో ఇలాంటి పాలకులు, వాతావరణం ఉన్నప్పుడు ఎవరో బదనాం చేసేందుకు చూస్తున్నారని గగ్గోలు పెట్టటం అంటే దొంగే దొంగని అరవటం తప్ప వేరు కాదు. విదేశాల్లో స్పందిస్తే జాతి దురహంకారం అని, దేశీయంగా స్పందించిన వారిని దేశద్రోహులని నిందిస్తూ ఎదురుదాడి చేస్తున్నారు.
- సత్య