Aug 08,2023 13:00
  • అనుకూలం 131, వ్యతిరేకం 102
  • మొరాయించిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌
  • చిట్టీలతో ఓటింగ్‌ ప్రక్రియ
  • వైసిపి మద్దతు, టిడిపి డుమ్మా

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజ్యసభలో ఢిల్లీ పౌరసేవల బిల్లు ఆమోదం పొందింది. బిల్లుపై ఓటింగ్‌ జరగ్గా, బిల్లుకు అనుకూలంగా 131, వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయి. రాష్ట్రానికి చెందిన వైసిపి బిజెపికి అనుకూలంగా ఓట్లు వేసింది. టిడిపి మాత్రం చర్చలో పాల్గొనలేదు. ఓటింగుకు డుమ్మా కొట్టింది. బిజెడి, బిఎస్‌పి కూడా బిజెపికి అనుకూలంగా నిలిచాయి. దీంతో బిల్లు ఆమోదం పొందినట్లు డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ ప్రకటించారు. అంతకముందు మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించినట్లు డిప్యూటీ ఛైర్మన్‌ తెలిపారు. దీనికి ప్రతిపక్షాలు నిరసన తెలుపుతూ డివిజన్‌ కోసం పట్టుబట్టాయి. దీంతో ఓటింగ్‌ నిర్వహించారు. ఢిల్లీ సీనియర్‌ ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన అధికారాన్ని లెఫ్టినెంట్‌ గవర్నరుకు అప్పగించే ఆర్డినెన్స్‌ స్థానంలో ఢిల్లీ సర్వీసుల బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ జరిగింది. ఢిల్లీ సర్వీసుల బిల్లును ఏం చేసైనా సరే సాధించాలని బిజెపి అనుకుంటోందని, ఈ బిల్లు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమని, ప్రాథమికంగా ప్రజా వ్యతిరేకమని కాంగ్రెస్‌ ఎంపి అభిషేక్‌ మను సింఘ్వి అన్నారు. ఏ విధంగానైనా బిల్లుకు ఆమోదం పొందడం ద్వారా ఢిల్లీ సర్వీసుల అధికారాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని బిజెపి అనుకుంటోందని విమర్శించారు. ఇది ప్రాంతీయ, ఢిల్లీ ప్రజల ఆకాంక్షలపై నేరుగా జరుపుతున్న దాడిగా ఆయన పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, సివిల్‌ సర్వీస్‌ అకౌంటబిలిటీ, అసెంబ్లీ ఆధారిత ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ నేత పి చిదంబరం మాట్లాడుతూ.. రాజ్యాంగ అంశాలు పక్కనపెడితే, ఈ బిల్లులో కమిటీ విషయాన్ని తెలుపుతానని అన్నారు. కమిటీలో ముగ్గురు సభ్యులు ఉంటారని, అందులో ముఖ్యమంత్రి, మరో ఇద్దరు కేంద్ర ప్రభుత్వంతో నియమితులైన వారు ఉంటారని తెలిపారు. మెజార్టీ ఇద్దరు కేంద్రం నియమించినవారే కాబట్టి వారి అభిప్రాయాలే నెగ్గుతాయని, ముఖ్యమంత్రి మాట చెల్లదని అన్నారు. అలాగే కమిటీ కోరం ఇద్దరిని బిల్లులో పేర్కొన్నారని, అలాంటప్పుడు ముఖ్యమంత్రి లేకుండానైనా కమిటీ సమావేశం నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఈ కమిటీ ప్రతిపాదనలు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదిస్తారని, ఇది చాలా ప్రమాదకరమని అన్నారు.
                               

                                                                25 ఏళ్ల వరుస ఓటములే కారణం : చద్దా

ఢిల్లీలో జరిగిన గత ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి దారుణమైన ఓటమి చవిచూసిందని, ఆ కారణంగానే బిజెపి ఈ బిల్లు తీసుకొచ్చిందని ఆప్‌ ఎంపి రాఘవ్‌ చద్దా ధ్వజమెత్తారు. 25 ఏళ్లుగా బిజెపి గెలుపునకు దూరమైందని, కేజ్రివాల్‌ ప్రభుత్వం కారణంగా మరో 25 ఏళ్లు గెలువలేమనే విషయం బిజెపికి బాగా తెలుసునని అన్నారు. ఆ కారణంగానే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ధ్వంసం చేయాలని బిజెపి కోరుకుంటోందన్నారు. తమ హక్కు గురించే తప్ప మరొకటి ఏమీ తాము కోరుకోవడం లేదన్నారు. ఢిల్లీ సర్వీసుల బిల్లు ఒక 'పొలిటికల్‌ ఫ్రాడ్‌' అని, రాజ్యాంగ పాపమని, ఢిల్లీలో ప్రభుత్వ యంత్రాగాన్ని స్తంభింప చేయడానికి ఉద్దేశించిన బిల్లు అని విమర్శలు గుప్పించారు. సమిష్టి బాధ్యతను గుర్తుచేసే పార్లమెంటరీ సిద్ధాంతాలను బలహీనపరచడమే ఈ బిల్లు ఉద్దేశమని అన్నారు. రాజ్యాంగ నేరానికి కేంద్రం పాల్పడుతోందని విమర్శించారు. ఇప్పుడు ఆఫీసర్లు ఎవరూ ముఖ్యమంత్రి, మంత్రులు మాట వినే పరిస్థితి ఉండదన్నారు.
            ఈ బిల్లుపై బికాష్‌ రంజన్‌ భట్టాచార్య (సిపిఎం), పి సంతోష్‌ కుమార్‌ (సిపిఐ), కె కేశవరావు (బిఆర్‌ఎస్‌), వి విజయసాయి రెడ్డి (వైసిపి), పి చిదంబరం (కాంగ్రెస్‌), తిరుచ్చి శివ (డిఎంకె), మనోజ్‌ కుమార్‌ ఝా, ఎడి సింగ్‌ (ఆర్‌జెడి), డెరిక్‌ ఓబ్రెయిన్‌, సుఖేందు శేఖర్‌ రారు (టిఎంసి), ఫౌజియా ఖాన్‌ (ఎన్‌సిపి), జవేద్‌ అలీ ఖాన్‌ (ఎస్‌పి), సంజరు రౌతు (శివసేన), అనీల్‌ ప్రసాద్‌ హెగ్డే (జెడియు), జోషి కె మణి (కెసిఎం), వైకో (ఎండిఎంకె), మహువా మాంఝీ (జెఎంఎం), సస్మిత్‌ పాత్ర (బిజెడి), ఎం తంబిదొరై (అన్నాడిఎంకె), జికె వసన్‌ (టిఎంసిఎం), సుధాన్షు త్రివేది, రాధా మోహన్‌ దాస్‌ అగర్వాల్‌, మహేష్‌ జఠ్మలానీ, ఘనశ్యామ్‌ తివారీ, కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి, భూవనేశ్వర్‌ కలిట, అనిల్‌ జైన్‌, సురేంద్ర సింగ్‌ నగర్‌, కవితా పటిదర్‌ (బిజెపి), కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథ్వాలే (ఆర్‌పిఐ), నామినేటెడ్‌ ఎంపిలు రంజన్‌ గొగోరు, అజిత్‌ కుమార్‌ భుయన్‌ మాట్లాడారు.
 

                                                    దేశ ప్రజలు తమకు అధికారం, హక్కు ఇచ్చారు : అమిత్‌ షా

అనంతరం బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమాధానమిస్తూ, సుప్రీంకోర్టు ఉత్తర్వులను బిల్లు ఉల్లంఘించలేదని అన్నారు. ఢిల్లీలో ఎలాంటి అవినీతికి తావులేని పాలన అందివ్వడం, అవినీతిపై పోరాటమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఢిల్లీలో పోస్టింగుల బదిలీల విషయంలో గతంలో ఎలాంటి గొడవులు లేవని, ముఖ్యమంత్రులతో ఎలాంటి సమస్యలు ఉండేవి కావని అన్నారు. 2015లో ఒక ఆందోళన తరువాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, కేంద్రం తమ హక్కులను లాక్కోవాలని చూస్తోందంటూ కొందరు మాట్లాడారని అన్నారు. ఆ విధంగా చేయాల్సిన పని కేంద్రానికి లేదని, దేశ ప్రజలు తమకు అధికారం, హక్కు ఇచ్చారని చెప్పారు. ఈ బిల్లు స్పష్టమైన చెల్లుబాటని పేర్కొంటూ సుప్రీంకోర్టు మాజీ సిజెఐ, ఎంపి రంజన్‌ గొగోరు ప్రసంగం సమయంలో సమాజ్‌ వాదీ పార్టీ నుండి జయా బచ్చన్‌, శివసేన (యుబిటి) నుండి ప్రియాంక చతుర్వేది, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) నుండి వందనా చవాన్‌, టిఎంసి నుండి సుస్మితా దేవ్‌ రాజ్యసభ నుండి వాకౌట్‌ చేశారు. ఇప్పటికే ఈ బిల్లు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది.
 

                                                           మొరాయించిన రాజ్యసభ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లు

బిల్లుపై ఓటింగ్‌కు ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయగా, డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ అనుమతించారు. అయితే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ ప్రక్రియ జరపాలని రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు సూచించారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లు మొరాయించడంతో చిట్టీలతో ఓటింగ్‌ నిర్వహించారు.
 

                                                                రాజ్యాంగానికి లోబడే ఢిల్లీ బిల్లు : విజయసాయి రెడ్డి

ఢిల్లీ సర్వీసుల బిల్లు రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడే ఉందని వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీ సర్వీసుల బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి ఉన్నందునే ఈ బిల్లుకు మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు.
           ఢిల్లీలో మంటలు రాజేస్తున్న డర్టీ పాలిటిక్స్‌ చేస్తున్నదెవరో తమకు తెలుసునని, ఆప్‌ సభ్యుడికి నేనిచ్చే సలహా ఒక్కటే నిప్పుతో చెలగాటం అడితే అది నిన్ను దహిస్తుందని అన్నారు. ఈ బిల్లు పాసైతే ఆమ్‌ ఆద్మీ పార్టీ కాస్త అబ్సల్యూట్‌ అనార్కీ పార్టీ (ఆప్‌) అవుతుందని, తానాషాహీ పార్టీ తమ స్వార్ధ ప్రయోజనాలకు ఢిల్లీని వాడుకోజాలదని అన్నారు. నీతిలేని పాలన నుంచి ఢిల్లీని రక్షించడానికే తాము ఈ బిల్లుకు మద్దతు తెలుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంలో ఇడి.. ఇడి.. అంటూ ప్రతిపక్షాలు నినాదాలు చేశాయి. వెంటనే స్పందించిన విజయసాయి రెడ్డి 'ఇడి మీ వద్దకు కూడా వస్తుంది' అని పేర్కొన్నారు.