Nov 17,2023 22:59

మాట్లాడుతున్న మనోహర్‌


ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయుటకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.పి.మనోహర్‌ కుమార్‌ అన్నారు. యుటిఎఫ్‌ ఎన్‌టిఆర్‌ జిల్లా ద్వితీయ కౌన్సిల్‌ సమావేశం శుక్రవారం సాయంత్రం నగరంలోని యుటిఎఫ్‌ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మనోహర్‌కుమార్‌ మాట్లాడుతూ 2018 డిఎస్‌సి తరువాత నేటికీ కూడా ఒక డిఎస్‌సి కూడా వేయకపోవడాన్ని తప్పుపట్టారు. డిఎస్‌సి నియామకాలు జరిపి సబ్జెక్టు టీచర్ల కొరత తీర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టుల్లో ప్రమోషన్‌లివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ ఎన్‌టిఆర్‌ జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ మున్సిపల్‌ ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వీసులు రూల్స్‌ విడుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.సుందరయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని సబ్జెక్టులలో 2024 సంవత్సరం రిటైర్‌ అవుతున్న వారి రిటైర్మెంట్‌ నోటీస్‌లు విడుదల చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ ఎన్‌టిఆర్‌ జిల్లా గౌరవాధ్యక్షులు మచ్చా శ్రీనివాస్‌, జిల్లా కోశాధికారి పి.నాగేశ్వరరావు, జిల్లా సహాధ్యక్షులు ఎం.కృష్ణయ్య, జిల్లా సహాధ్యక్షురాలు డి.అపర్ణ, జిల్లా కార్యదర్శిలు కె.గంగరాజు, బి.సిహెచ్‌. సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.