ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర బడ్జెట్ రాష్ట్ర ప్రజలను నిరాశ పరిచిందని టిడిపి ఎంపి గల్లా జయదేవ్ విమర్శించారు. మంగళవారం నాడిక్కడ గల్లా జయదేవ్ మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా రాష్ట్ర విభజన హామీలు అమలు కాలేదని, రానున్న రెండేళ్లలో విభజన హామీలు అమలవుతాయో లేదో తెలీదని అన్నారు. పిఎం గతి శక్తిని అభినందిస్తున్నామని, దీనివల్ల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. వ్యవసాయ రంగానికి కావాల్సిన కేటాయింపులు లేవని, నదుల అనుసంధానం ద్వారా ఏ రాష్ట్రానికి ఎంత వాటా వస్తుందో వేచి చూడాలని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ నిరుత్సాహపరిచిందని టిడిపి రాజ్యసభ ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు. ఏపి డిమాండ్లపై కమిటీ వేశారని బాధ్యతలు విస్మరిస్తారా? అని ప్రశ్నించారు.










