ప్రజాశక్తి-జక్కా వెంకయ్య, టి నర్సింహయ్య, సున్నం రాజయ్యనగర్(తాడేపల్లి)
గత నాలుగేళ్లలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిర్వహించిన బాలోత్సవాలకు విశేష స్పందన లభించిందని, కరోనా కాలంలో ప్రజలకు వైద్య సేవలందించడంలో నెల్లూరు ప్రజావైద్యశాల ముందుపీఠిన నిలిచిందని బుధవారం సిపిఎం రాష్ట్ర 26వ మహాసభలో పలువురు ప్రతినిధులు చెప్పారు. వారు ఆయా రంగాలకు సంబంధించి చర్చల్లో పాల్గొన్నారు. వివరాలిలా....
ముమ్మరంగా బాలోత్సవాలు : రమాదేవి
కోవిడ్కు ముందూ, తర్వాతా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిర్వహించిన బాలోత్సవాలకు విశేష స్పందన లభించిందని బాలల సంఘం బాధ్యురాలు రమాదేవి చెప్పారు. గత నాలుగేళ్లలో.. 12 జిల్లాల్లో నిర్వహించిన వివిధ బాలోత్సవాల్లో వేలాది మంది పాల్గన్నారని చెప్పారు. నెల్లూరులో 40 మందితో బాలల యూనిట్ ఏర్పడడమే గాక నిత్యమూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, బాలల సంబంధాల ద్వారా యువజన, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాల్లో పరిచయాలచ్చాయని వివరించారు. విశాఖలో 11 ఏళ్లుగా నివాస ప్రాంతాల్లో కొనసాగుతున్న చిల్డ్రన్స్ క్లబ్స్ మాదిరిగా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందని తెలిపారు.
రోగం రాకుండానే ముందు జాగ్రత్త చర్యలు : డాక్టర్ రమేష్బాబు
నెల్లూరులో ఐదు దశాబ్ధాలుగా డాక్టర్ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలందిస్తోందని ప్రజా వైద్యులు డాక్టర్ రమేష్బాబు చెప్పారు. అందువల్లనే తమ ఆసుపత్రికి ఆదరణ లభిస్తోందని, ఉన్న 200 పడకలూ చాలడం లేదని చెప్పారు. ప్రాథమిక వైద్యం బలోపేతం కావాల్సి ఉందని చెప్పారు. రోగం రాకుండా ముందుగానే తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై అవగాహనా పెంచే కార్యక్రమాలు ప్రజావైద్య శాల తరపున చేపట్టాల్సి ఉందన్నారు.
విభిన్న ప్రతిభావంతుల పింఛన్కూ ఎగనామం : సోమయ్య
విభిన్న ప్రతిభావంతుల పరిరక్షణ చట్టం వచ్చి ఐదేళ్లయినా విభిన్న ప్రతిభావంతులను ఆదుకునేటట్లుగా ఆ చట్టం అమలుకావడం లేదని విభిన్నప్రతిభావంతుల నేత సోమయ్య చెప్పారు ఒకే ఇంట్లో రెండు పింఛన్లు ఉన్నాయనే పేరిట విభిన్న ప్రతిభావంతుల పింఛనూ నిలిపివేస్తున్నారని, వివాహ ప్రోత్సాహకం ఇవ్వం లేదని, ట్రైసైకిళ్లు, హ్యాండ్స్టిక్స్, బ్యాటరీ వాహనాల పంపిణీ ప్రక్రియ జరగడం లేదని ఆయన వివరించారు.

సాంకేతికత పెరిగింది : శ్రీపాద
కరోనా కాలంలో సాంకేతిక అవసరాలు పెరి గాయని, విద్యావసరాలు ఆన్ లైన్లో కొనసాగుతోందని, వివిధ సంస్థల్లో పనిచేస్తున్న వారు అంతర్జాలాన్ని ఉపయో గించుకుని వర్క్ఫ్రం హోంచేయడం పెరిగిందని ఐటి సెక్టార్ బాధ్యులు శ్రీపాద చెప్పారు. నూతనంగా వస్తున్న సాంకేతిక మార్పులను అర్ధంచేసుకుని మారకపోతే నైపుణ్యాన్ని కోల్పోయి వెనకబడిపోతామని చెప్పారు. కోవిడ్ మొదటి దశలో ఆసుపత్రుల్లో ఎవ్వరినీ చేర్చుకోని కాలంలో 200 మంది డాక్టర్లతో ప్రజా రోగ్యవేదిక ఏర్పాటుచేసి హెల్ప్లైన్ ద్వారా విశిష్ట సేవలందించామని చెప్పారు.











