Feb 28,2023 19:35

హైదరాబాద్‌ :అగ్ని వీరుల నియామకానికి నిర్వహించే ప్రాథమిక అర్హత పరీక్ష కోసం రాష్ట్రంలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆర్మీ నియామక అధికారి కీట్స్‌ కె.దాస్‌ తెలిపారు. హైదరాబాద్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను అభ్యర్థులు ప్రాధాన్యతా క్రమంలో ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఆర్మీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకుని నిర్ధేశించిన పరీక్ష ఫీజు చెల్లించిన తర్వాతనే ప్రక్రియ పూర్తవుతుందని, ఆయా అభ్యర్థులకు హాల్‌ టికెట్లు పంపిస్తామని కీట్స్‌ తెలిపారు. ఐటీఐ లేదా పాలిటెక్నిక్‌ అభ్యర్థులకు 20 నుంచి 50 మార్కుల వరకు బోనస్‌గా లభిస్తాయని ఆయన తెలిపారు.ఈ పరీక్ష కోసం ఫిబ్రవరి 16 నుంచి మార్చి 15 వరకు దరఖాస్తులు ఆహ్వానించనున్నట్టు అధికారులు వెల్లడించారు. రెండు దశల్లో చేపట్టే ఈ ఎంపిక ప్రక్రియలో తొలుత ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ చేపట్టి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఏప్రిల్‌ 17నుంచి అగ్నివీర్‌ ప్రాథమిక అర్హత పరీక్ష జరగనుంది. అగ్నివీరులుగా చేరేందుకు https://www.joinindianarmy.nic.in/index.htm  లో దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు.