Nov 18,2023 13:15

పరవాడ (విశాఖ) : పరవాడ మండలంలో రావాడ పంచాయతీ గొల్లగుంట గ్రామం ముస్లిం మైనారిటీలకు చెందిన స్మశానవాటికకు రక్షణ కల్పించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. వారి పూర్వీకుల కాలం నుండి ఉన్న స్మశానవాటికను కబ్జా చేయడానికి ఇప్పటికే ఉన్న ఫెన్సింగ్‌ పోల్స్‌ ను రాత్రి సమయంలో విరగ్గొట్టి స్మశానవాటిక భూమిని తమ సొంత భూమిలోకి కలుపుకోవాలని ప్రయత్నించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన స్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ... పూర్వీకుల నుండి స్మశాన వాటికకు ఉపయోగిస్తున్న స్థలాన్ని కబ్జా చేయాలని దౌర్జన్యం పూర్వకంగా పెన్సింగ్‌ పోల్స్‌ ని విరగ్గొట్టారని అన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్‌ దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మైనార్టీలకు రక్షణ కల్పించాలని కోరారు. గొల్లగుంట ముస్లిం స్మశానవాటికను రెవిన్యూ అధికారులు పక్కనే ఉన్న గెడ్డ వాగులో చూపించే ప్రయత్నం చేస్తున్నారని వాస్తవంగా ఎవరైనా మరణిస్తే ముస్లిం సంప్రదాయం ప్రకారం ఖననం చేసి సమాధులు నిర్మించుకుంటారని అలాంటిది నీరు ప్రవహించే గెడ్డ వాగుల్లో ఎలా ఖననం చేసి సమాధులు నిర్మిస్తారని ప్రశ్నించారు. రెవిన్యూ అధికారులు భూ యజమానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వెంటనే అలాంటి అధికారులపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, స్మశానవాటికను రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని కోరారు. స్మశానవాటికకు ఇప్పటికే గొల్లగుంట నుండి ప్రభుత్వ నిధులతో గ్రావెల్‌ రోడ్‌ నిర్మించారని అయితే కిందిస్థాయి అధికారులు ఉన్నత స్థాయి అధికారులకు భూ యజమానికి అనుకూలంగా స్మశానవాటిక స్థలాన్ని కబ్జా చేయడానికి సహకరిస్తున్నారని అలాంటి అధికారులపై జిల్లా ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేసి వారిని విధుల నుండి తొలగించాలని గని శెట్టి డిమాండ్‌ చేశారు. మైనార్టీల స్మశానవాటికను రక్షణ కల్పించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని గనిశెట్టి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు షేక్‌ ఆలీ, గ్రామ పెద్దలు అబ్దుల్‌ జలీల్‌, షేక్‌ యాసీన్‌, మదీనా, జాకీర్‌ హుస్సేన్‌, మహమ్మద్‌ రఫీ, అజారుద్దీన్‌, షేక్‌ బాషా, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.