Feb 02,2023 06:39

ప్రాంతీయ అసమానతలు, ప్రాంతీయ వాదం విడదీయ లేని కవల పిల్లలు. నాయకులు తమ రాజకీయ ఉనికి లేక అవసరార్థం ప్రాంతీయ అసమానతలు పెంచి పోషించుతూ మరోవైపు ప్రజల్లో తలెత్తుతున్న అసంతృప్తిని భావోద్వేగాలకు ఉపయోగించుకొంటున్నారు.
అవశేష ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ ప్రాంతీయ అసమానతలు కొనసాగడానికి కేంద్ర ప్రభుత్వం తొలి ముద్దాయి. రాష్ట్రాధినేతలూ ఇందుకు తీసిపోలేదు. దేశంలో తరచుగా రాష్ట్రాధినేతలు ఇతర అభివద్ధి చెందిన రాష్ట్రాలతో సమానంగా తమ రాష్ట్రం పురోగతి సాధించేందుకు ప్రత్యేక పథకాలు, రాయితీలు అవసరమని కేంద్రాన్ని కోరుతుంటారు. అంత వరకు బాగానే ఉన్నా...అదే రాష్ట్రానికి వచ్చేసరికి అభివృద్ధి చెందిన జిల్లాలతో సమానంగా వెనుక బడిన జిల్లాలు అభివృద్ధి కోసం బడ్జెట్‌లో ఒక్క పైసా అదనంగా విదల్చక పోవడమే నేటి విషాదం.
రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌ 46(3)లో రాయలసీమ ఉత్తరాంధ్ర ఏడు జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ పొందుపర్చారు. అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ 2014 ఫిబ్రవరి 20వ తేదీ రాజ్యసభలో మాట్లాడుతూ రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు బోలంగీర్‌ కలహండి తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. కాగా మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ లో వ్యాపించి వున్న బుందేల్‌ ఖండ్‌ తరహాలో ఈ ప్యాకేజీ వుంటుందన్నారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ. 24,350 కోట్లతో ప్రతిపాదనలు కేంద్రానికి పంపితే ముష్టిగా జిల్లాకు రూ. 50 కోట్లు చొప్పున మూడేళ్లు ఇచ్చి తర్వాత ఎగ్గొట్టారు. ఇప్పటికీ సవా లక్ష కొర్రీలు వేస్తున్నారు. విభజన చట్టం సెక్షన్‌ 94 (3) మేరకు వెనుక బడిన జిల్లాల్లో భౌతిక సామాజిక వనరులు అభివృద్ధి చేయాలి. ఈ చట్ట బద్ద హక్కులు హుష్‌ కాకి అయ్యాయి. ఇక ప్రత్యేక హోదా వుండనే వుంది.
నాణేనికి ఇది ఒక వైపు అయితే మరో వైపు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాల ఫలితంగా ప్రజల్లో నివురు గప్పిన నిప్పులాగా వున్న అసంతృప్తిని కొందరు నేతలు తమ రాజకీయ అవసరార్థం ఉపయోగించుకొంటున్నారు. వాస్తవంలో ఆయా వెనుకబడిన ప్రాంతాల భౌతిక పరిస్థితులు ప్రజల అవసరాలు వీటితో పాటు వారి వాంఛలు ఆధారం చేసుకొని ప్రత్యేక పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. కాని ఆ దిశగా చర్యలు లేక పోవడంతో మంత్రి ధర్మాన ప్రసాదరావు గాని రాయలసీమలో కొందరు నేతలే కాకుండా ప్రత్యేకించి ఒక సెక్షన్‌ యువత వేర్పాటు వాదం తెర మీదకు తెస్తున్నది. ఉత్తరాంధ్రలో విస్తారమైన సముద్ర తీరం వున్నందున పైగా విశాఖలో నౌకాదళం కేంద్రం వున్నందున మిగతా జిల్లాలతో పోల్చుకొంటే విశాఖ జిల్లా కొంత మెరుగ్గా వుంది. ధర్మాన ప్రసాదరావు మంత్రిగా వున్నప్పుడే వైయస్‌ రాజశేఖర రెడ్డి హయాంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రూపుద్దుకున్నది. ఈ పథకం అమలు జరిగితే ఉత్తరాంధ్రలో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు 30 లక్షల మందికి తాగునీటి వసతి ఏర్పడుతుంది. విజయ నగరం జిల్లాలో 3.94 లక్షల ఎకరాలకు శ్రీకాకుళం జిల్లాలో 0.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ మూడేళ్ల కాలంలో ఎప్పుడైనా మంత్రులు బొత్స సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావులు ఈ పథకం అమలు జరగలేదని మంత్రి పదవులకు రాజీనామాకు సిద్ధమై వుంటే వీరి చిత్తశుద్ధి శంకించలేము. కాని భావోద్వేగాలతో ప్రజల్ని రెచ్చగొట్టేందుకు మంత్రి పదవులు త్యాగం చేస్తామంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి అనుసంధానం ఏళ్ల కొద్దీ ఎందుకు నానుతుంది? వంశధారపై నెరెడి బ్యారేజీ నిర్మాణం గుర్తు వుందా? వ్యవసాయంపై ఆధారపడే లక్షలాది మంది ఉత్తరాంధ్ర రైతులకు సాగునీరు కావాలా? ఇవేవీ లేకుండా పరిపాలన రాజధాని కావాలా? పోలవరం ప్రాజెక్టు నుండి విశాఖ తాగునీటికి 23.99 టియంసిలు నీరు కేటాయించారు. పోలవరం గాలిలో దీపమైంది!
రాయలసీమ పరిస్థితి మరీ దుర్భరంగా వుంది. ఈ ప్రాంతంలో విస్తారమైన బీడు భూములున్నాయి. ఎక్కువ భాగం వర్షాధార పంటలైనందున మొత్తంగా నీళ్లు నీళ్లు అని ప్రజలు తుదకు తాగునీటికి తపిస్తుంటారు. ఈ ఏడు విస్తారంగా వర్షాలు పడ్డాయి. కాని గ్రామాల్లో ఉపాధి లేక గ్రామాలకు గ్రామాల ప్రజలు వలసలు పోతున్నారు. మరీ దారుణమేమంటే కెసి కెనాల్‌ కింద ఆయకట్టులో పెట్టిన పంటలకు నీళ్లు అందే అవకాశం లేదని నేడు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పాటికే హంద్రీనీవా కింద కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో పంటలు ఎండిపోయాయి.
బచావత్‌ ట్రిబ్యునల్‌ కెసి కెనాల్‌ కు తుంగభద్ర నుండి 39.9 టియంసిలు నీరు కేటాయించినది. దురదృష్టం ఏమంటే దశాబ్దాలు గడుస్తున్నా 2.65 లక్షల ఎకరాలు ఆయకట్టుగల కెసి కెనాల్‌ కు 1.25 టియంసిలు సామర్థ్యం గల సుంకేసుల బ్యారేజీ తప్ప నీళ్లు నిల్వ చేసే వసతి లేదు. 2.965 టియంసిలు నిల్వ సామర్థ్యంతో నిర్మించిన అలగనూరు రిజర్వాయర్‌ లో నీరు నిల్వ చేసే అవకాశం లేక పశువుల మేత పొరంబోకుగా వుంది. బచావత్‌ ట్రిబ్యునల్‌ గాని బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ గాని సుంకేసుల బ్యారేజీ నుండి (21ం10)టియంసిల నీరు మాత్రమే శ్రీశైలం జలాశయం చేరుతుందని తేల్చారు. కాని ఏటా వందల టియంసిలు కలుస్తున్నాయి. ట్రిబ్యునల్‌ కేటాయింపులు అరకొరగా వున్నా చట్టబద్దత గల నీళ్లు వర్షపు నీరు నిల్వ చేసుకొనే ఏర్పాట్లు జరిగి వుంటే రాయలసీమలో కొంతలో కొంత నీటి కొరత తీరేది.
కెసి కెనాల్‌ ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించిన గుండ్రేవుల రిజర్వాయర్‌ హుళక్కి అయింది. జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాయలసీమ ఎత్తిపోతల పథకం న్యాయ రాజధాని రెండు పథకాలకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి రాయలసీమను కోనసీమ చేస్తామన్నారు. ఎత్తిపోతల పథకం కోర్టు వివాదంలో చిక్కుకున్నది. న్యాయ రాజధాని కాదు కదా తుదకు కృష్ణ యాజమాన్య బోర్డు కార్యాలయం గతి లేకపోయింది. ఈ మధ్య సీమ రైతులు రోడెక్కి సిద్దేశ్వరం కోసం పోరాటం మొదలు పెట్టారు. దురదృష్టమేమంటే రాయలసీమలో చిన్న కాలువ తవ్వాలన్నా తెలంగాణ ఇంజనీరింగ్‌ చీఫ్‌ యాజమాన్యం బోర్డుకు రేఖ రాసి అడ్డుకొంటున్నారు. ఇరువురు ముఖ్యమంత్రులు బాగానే వున్నా (చంద్రబాబుతో పోల్చితే) రెండు రాష్ట్రాల మధ్య గల అంతర్‌ రాష్ట్ర జల వివాదాలు సామరస్యంగా పరిష్కారానికి కృషి జరగడం లేదు. కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది. కాగా గత ప్రభుత్వం ఏం చేసింది అనేది పక్కన పెడితే జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మూడేళ్ల కాలంలో సాగునీటి రంగంలో 19 వేల కోట్ల రూపాయలు వ్యయం చేసిందంటే ఇందులో వెనుక బడిన ప్రాంతాల భాగం అతి స్వల్పమే. రాష్ట్రంలో వెనుకబడిన ఈ రెండు ప్రాంతాల్లో పరిస్థితులు దుర్భరంగా వున్నాయి. ప్రాంతీయ అసమానతలు నెలకొన్నాయి. అవేవీ పట్టించుకోకుండా పరిష్కార మార్గాలు చూడకుండా పాలకులు కాలం వెళ్లదీస్తే కుదరదు.

sankaraiah
 

 

 

వ్యాసకర్త : వి.శంకరయ్య, విశ్రాంత పాత్రికేయులు
సెల్‌ : 9848394013 /