
- హైకోర్టు కీలక ఉత్తర్వులు
- రైతాంగంలో హర్షం
- నిలిచిన పనులు
ప్రజాశక్తి-యంత్రాంగం : రాజధాని అమరావతిలో ఆర్-5 జోన్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఇళ్ల నిర్మాణాలను నిలిపేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక్కడ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. హైకోర్టు తీర్పు పట్ల రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమైనాయి. న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు తెలుపుతూ అనేకచోట్ల రైతులు ప్రదర్శనలు, నినాదాలు చేశారు. తుళ్లూరు, కృష్ణాయపాలెంలోని దీక్షా శిబిరాల్లో న్యాయ దేవతలకు పాలాభిషేకం చేశారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కృష్ణాయపాలెంలోని ఆర్-5 జోన్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అక్కడ నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులను పోలీసులు బయటకు పంపించారు. అంతకముందు జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రారు, జస్టిస్ రవీనాథ్ తిల్హరితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆర్-5 జోన్లో ఇళ్ల నిర్మాణాలపై విచారణ జరిపింది. ఇళ్ల పట్టాల కేటాయింపు కోర్టు ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేసిన ధర్మాసనం తుది తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే ఇళ్ల నిర్మాణాలకు చేసే ప్రజాధనం వృథా అవుతుందనే కోణంలో స్టే ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇళ్ల నిర్మాణంపై దాఖలైన వివిధ పిల్లను పరిశీలించిన అనంతరం ఈ మేరకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.