Nov 11,2023 10:43

ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశం
పెనుకొండలో నిర్మాణ పనులు చేపట్టిన బాధితులు
ప్రజాశక్తి - పెనుకొండ  :  
ఇళ్ల పట్టాల కోసం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో పేదలు చేపట్టిన పోరాటం ఫలించింది. వారి న్యాయమైన సమస్యను హైకోర్టు గుర్తించింది. పేదలకు ఇళ్లు పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ రెవెన్యూ అధికారులను ఆదేశించింది. పెనుకొండలో ఇళ్లు లేని నిరుపేదలు స్థలాల కోసం గత ఆరు నెలలుగా సిపిఎం, వ్యకాసం ఆధ్వర్యంలో భూ స్వాధీన ఉద్యమం నిర్వహిస్తున్నారు. పెనుకొండ పట్టణ సమీపంలోని మడకశిర రోడ్డులో ఉన్న ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్నారు. అయితే రెవెన్యూ అధికారులు పోలీసుల సాయంతో గుడిసెలను నెల రోజుల క్రితం కూల్చివేశారు. అక్కడున్న పేదలను బలవంతంగా బయటకు గెంటేశారు. దీంతో, వారంతా సిపిఎం ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలంటూ అక్టోబర్‌ 15న వాజ్యం వేశారు. ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్న పేదలకు అక్కడే పట్టాలు ఇవ్వాలని, ప్రత్యామ్నాయ స్థలాలు ఇచ్చేంత వరకు వారిని అక్కడి నుంచి ఖాళీ చేయొచ్చొదని అక్టోబర్‌ 30న హైకోర్టు తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పుపై పేదలు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఇళ్ల నిర్మాణాలకు పునాదులు తీసి పనులు చేపట్టారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై ఈ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 20లోపు పెనుకొండలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లేకుంటే 21న తామే పేదల పక్షాన నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, జిల్లా కమిటీ సభ్యులు వెంకట్రాముడు, నారాయణ, పేదలు పాల్గొన్నారు.