Feb 07,2021 11:43

విశాఖ : విశాఖ స్టీల్‌ ప్లాంటుకు సంబంధించి ఒక్క శాతం వాటా కూడా అమ్మడానికి వీలులేదని అటువంటి ప్రతిపాదనను ప్రజలు వ్యతిరేకించాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ నర్సింగరావు ఒక ప్రకటనలో కోరారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వ్యూహాత్మక అమ్మకం నిర్ణయాన్ని పునపరిశీలించాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రధానికి లేఖ రాశారు. అయితే స్టీల్‌ ప్లాంట్‌ను స్టాక్‌ మార్కెట్‌లో నమోదు చేయాలని, తద్వారా ప్రజలకు షేర్లు అందుబాటులోకి వస్తాయని కోరడం సబబుకాదని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయిల రుణాలను మాఫీ చేస్తున్నాయని, అలాంటిది విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఉన్న రుణాలను కూడా మాఫీ చేయాలి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమైన స్టేక్‌ హౌల్డర్‌. అలాంటిది ప్లాంట్‌ను అమ్మాలని కేంద్రం నిర్ణయించ డానికి ముందు రాష్ట్ర ప్రభుత్వంతో కనీసం సంప్రదిం చకపోవడం సరికాదు. ఫెడరల్‌ వ్యవస్థకు ప్రమాదక రమైన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ముఖ్యమంత్రి ప్రస్తావించి వుండల్సిందని నర్సింగరావు అభిప్రాయ పడ్డారు.శాసనసభ ప్రత్యేక సమావేశం జరిపి స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం అవసరం. గతంలో సేలం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రయత్నం జరిగినప్పుడు తమిళనాడు శాసన సభ దానిని వ్యతిరేకిస్తూ తీర్మానించి, ప్రైవేటీకరణను నిలుపుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు.