Jul 20,2021 16:34

పారిస్‌ : ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఒ గ్రూపు అనే ఓ సంస్థ అభివృద్ధి చేసిన 'పెగాసస్‌' స్పైవేర్‌ జర్నలిస్టులపై నిఘా పెట్టడానికి ఉపయోగించినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించినట్లు పారిస్‌లోని న్యాయవాదులు తెలిపారు. 'పెగాసస్‌' స్పైవేర్‌ వ్యక్తిగత గోప్యత ఉల్లంఘన, వ్యక్తిగత ఎలక్ట్రానిక్‌ పరికరాలకు మోసపూరితమైన ప్రాప్యత, క్రిమినల్‌ అసోసియేషన్‌ వంటి పది వేర్వేరు ఆరోపణలపై దర్యాప్తులను పరిశీలన జరుపుతున్నామని న్యాయవాదులు తెలిపారు. కేవలం ఎన్‌ఎస్‌ఓ యాభై వేల ఫోన్‌ నెంబర్లు మాత్రమే కాదు.. గతంలో అనుకున్నదానికంటే అంతకుమించి చాలా విస్తృతంగా హ్యాకింగ్‌ చేయడం జరిగిందని వాషింగ్టన్‌ పోస్ట్‌, ది గార్డియన్‌, లే మోండే, ఇతర మీడియా సంస్థలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్‌ఎస్‌ఒ లక్ష్యంగా చేసుకున్న వారిలో మీడియా పార్ట్‌ వ్యవస్థాపకుడైన ఎడ్వీ ప్లీనెల్‌ కూడా ఒకరని.. మీడియా పార్ట్‌ నివేదించింది. అలాగే హ్యాకింగ్‌ చేయాలనే లక్ష్యంగా చేసుకున్న వారిలో లే మోండే, ఏజెన్స్‌ ఫ్రాన్స్‌ - ప్రెస్సే ఉద్యోగులు కూడా ఉన్నారని తెలుస్తోంది.