Sep 29,2023 16:40
  • వినూత్న కార్యాచరణకు పిలుపు

ప్రజాశక్తి-అమరావతి : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును స్కిల్‌ కేసులో అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ 'మోత మోగిద్దాం' అంటూ వినూత్న కార్యాచరణకు పిలుపునిచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా ఐదు కోట్ల ఆంధ్రులు ఈ నెల 30వ తేదీ శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ఐదు నిమిషాల పాటు ఉన్న చోటే మోత మోగించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాశబ్దం వినిపిద్దామని పేర్కొన్నారు.
''ఇంట్లోనో, ఆఫీసులోనో, ఇంకెక్కడ ఉన్నా... బయటికొచ్చి గంట లేదా ప్లేటు మీద గరిటెతో కొట్టండి. లేదా విజిల్‌ వేయండి. రోడ్డు మీద వాహనంతో ఉంటే హారన్‌ కొట్టండి... మీరు ఏంచేసినా వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయండి.. అక్రమ అరెస్ట్‌ చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గబోమని నిరూపిద్దాం.. నిలువెత్తు నిజాయతీకి ప్రతిరూపం, తెలుగు తేజం చంద్రబాబుకు మద్దతుగా తెలుగువారంతా ఉన్నారని నిరూపించే తరుణం ఇది. నిష్కళంక రాజకీయ మేరునగధీరుడు చంద్రబాబుకు మద్దతుగా మోత మోగిద్దాం'' అని పిలుపునిచ్చారు.