Jan 07,2021 00:29

ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న పెందుర్తి ఎమ్మెల్యే ఆదీప్‌రాజు

ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ సదుపాయాలు కల్గిన పరవాడలోని జవహార్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో భారతదేశంతో పాటు ఆసియాలో పర్యావరణ నిర్వహణ సేవలందిస్తున్న ర్యాంకీ ఎన్విరో ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ నూతన కేంద్రాన్ని బుధవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా ర్యాంకీ రిక్లామేషన్‌ అడ్‌ రీసైక్లింగ్‌ లిమిటెడ్‌ సిఇఓ సతీష్‌ మాట్లాడుతూ, పారిశ్రామిక వ్యర్ధాలతో పాటు గృహల్లోని ప్లాస్టిక్‌ వ్యర్ధాలను శుద్ధిచేసి నాణ్యత కల్గిన రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌ గ్రాన్యూల్స్‌గా మార్చి ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, ప్యాకేజీల తయారీ కోసం వినియోగించవచ్చన్నారు. ప్లాస్టిక్‌ వ్యర్ధాలు రీ సైక్లింగ్‌తో పాటు పర్యావరణ హాని తగ్గించడానికి కృషి చేస్తున్నామన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజు మాట్లాడుతూ, తన నియోజకవర్గంలో ప్లాస్టిక్‌ రీ సైక్లింగ్‌ సదుపాయం కల్పించిన సంస్థను అభినందించారు. జెఎన్‌ ఫార్మా మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ లాల్‌కృష్ణ మాట్లాడుతూ రీ సైక్లింగ్‌ కేంద్రం ఉపయోగాలను వివరించారు.