ప్రజాశక్తి - తిరుపతి క్యాంపస్ : విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరేందుకు విద్యార్థి దశలోనే నిర్దిష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకోవాలని, విజయం సాధించేదాకా విరామం ఇవ్వరాదని అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి కుమారి రజని పిలుపునిచ్చారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థులతో శుక్రవారం "ఇంటరాక్షన్ విత్ రజని" కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమారి రజని మాట్లాడుతూ, తాను తిరుపతిలోనే చదివి నిరంతర శ్రమతో అనేక పరాజయాల నడుమ అంతర్జాతీయ క్రీడాకారిణిగా విజయం సాధించానని చెప్పారు. శ్రీ వేంకటేశ్వర స్వామి దయతో తాను ఈ స్థాయికి చేరుకోగలిగానన్నారు. జీవితంలో సమస్యలు ఎన్ని వచ్చినా వెనుకంజవేయకుండా లక్ష్యసాధన దిశగా దూసుకుపోవాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళలు మానసికంగా అత్యంత ధైర్యంగా ఉండి సమస్యలను ఎదిరించాలని చెప్పారు. తన జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన విధానాన్ని హాకీలోని మెలకువలను, క్రీడల వల్ల లభించే కీర్తి ప్రతిష్టలను,ఉన్నత ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు. డిఈవో డాక్టర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్యాన్ని నిరంతరం గుర్తు పెట్టుకోవాలని చెప్పారు . జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిరాశ చెందకూడదన్నారు . అకుంఠిత దీక్ష, శ్రమతో ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చన్నారు. విద్యార్థులకు టీటీడీ అందించే సౌకర్యాలను ఉపయోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణమ్మ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శ్రీపద్మావతి మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భువనేశ్వరి, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ మస్తాక్ అహ్మద్, అధ్యాపకులు డాక్టర్ భాస్కర్, డాక్టర్ భీమన్న, కిరణ్ కుమార్, రామకృష్ణారెడ్డి, విజయశ్రీ, పాల్గొన్నారు.










