
''భారత రిపబ్లిక్ లోని యువతీ యువకులారా! సిపాయిలారా! విశ్రాంతిగా, నిరర్ధకంగా నిలబడకండి. అడుగులో అడుగు వేస్తూ కార్యోన్ముఖులు కండి. తీవ్రమైన ఆకలి, పేదరికం మీకు సవాలు విసురుతోంది! దాన్ని తిప్పికొట్టాల్సి ఉంది. మీరొక మంచి మిషన్ (ధ్యేయం)లో నిమగమై ఉన్నారు. దేశం అన్ని వైపులా, అన్ని మూలల్లో విప్లవ జ్వాలలు అంటుకుంటున్నాయి. ప్రజల్ని సమాయత్తం చేయండి. వినిపిస్తున్న బిగుల్ ధ్వని (యుద్ధభేరి) వినండి. విని కదలండి. ఇలాగే నిశ్చేష్టులై నిస్సారంగా జీవితం గడపకండి..''
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 'వికాస్' అనే మాట తరచూ మాట్లాడుతూ ఉంది. అది అణగారిన వర్గాల రక్తమాంసాల్ని, మైనార్టీల అస్థిపంజరాన్ని కార్పొరేట్ శక్తులకు నైవేద్యం పెడుతూ దేశాన్ని ఏ ప్రగతి మార్గంలో నడిపిస్తోంది? దేశంలోని ప్రతి సగటు మనిషి గుండెమీద చేయివేసుకుని, తమకు తిండి, బట్టా దొరుకుతున్నాయా? అని-తమ పిల్లలకు సరైన చదువు చెప్పించగలుగుతున్నామా? అని ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ దేశ ప్రజలకు ఆరోగ్య సదుపాయం, రవాణా సౌకర్యాలు సరిగా అందుతున్నాయా? యువతకు ఉపాధి లభిస్తోందా? రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకోగలుగుతున్నారా? అని ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. దేశ ప్రజల్ని మతాల ప్రాతిపదికన, కులాల ప్రాతిపదికన, ఆర్థిక స్తోమతల ప్రాతిపదికన విభజించి పాలిస్తూ 'దేశ్ కా వికాస్' ఎలా తేగలుగుతున్నారో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. బ్రిటిష్వాడు విభజించి పాలించాడంటే అర్థం చేసుకోవచ్చు. వాడు విదేశీయుడు. ఇప్పుడు మరి వీరికేమయ్యింది? అందరం ఈ దేశ వాసులమే కదా ?
మరి, ఈ దేశ ప్రజలకు ఏమైందీ? అజ్ఞానానికి, మూర్ఖత్వానికి పట్టం కడుతున్నారు? ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది.
దేశ భక్తుడు షహీద్ భగత్సింగ్ ఎందుకు గుర్తుకు రావడం లేదూ? ఈ దేశాన్ని రక్షించుకోవడానికి రక్తం చిందించిన అమరవీరులైన దేశభక్తులెవరూ ఎందుకు గుర్తుకు రావడం లేదూ? ఎందుకు దేశద్రోహులను, మోసగాళ్ళను గద్దెనెక్కిస్తున్నాము? మనం ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక క్రైస్తవుడిగా పుట్టడమన్నది యాదృచ్ఛికం. ఎవరు, ఎక్కడ, ఏ ప్రాంతంలో పుట్టాలన్నది ఎవరి ఆధీనంలోనూ ఉండదు కదా? ఏది ఏమైనా, అందరం ఈ దేశ వాసులం. భారతీయులం. అంతకన్నా ముఖ్యం... అందరం మనుషులం! తేడాలెందుకూ? విభజనలెందుకూ? కుట్ర పూరితంగా విభజనలు ప్రోత్సహించే వారి ఆట కట్టించాలి కదా? అబద్ధాలు చెపుతూ పుకార్లు ప్రచారం చేసే వారి భరతం పట్టాలి కదా? కరోనా కష్ట కాలంలో లక్షలమంది వలస కార్మికులకు కనీసం రైలు, బస్సు సౌకర్యం కల్పించలేని ప్రభుత్వ అసమర్థత ఎందుకు కనిపించడం లేదూ? లక్షల కోట్లు బ్యాంకు దోపిళ్ళు చేసిన వారిని మాత్రం భద్రంగా దేశం దాటిస్తారా? అదేనా ఈ దేశ చౌకీదారు చేయాల్సిన పని? అధిక సంఖ్యాకులైన సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపలేని - 'ప్రజా సేవకులు' మనకు అవసరమా ?
ఈ దేశంలోని యువతరాన్ని సంభోదిస్తూ దేశభక్తుడు షహీద్ భగత్సింగ్ చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి... ''భారత రిపబ్లిక్ లోని యువతీ యువకులారా! సిపాయిలారా! విశ్రాంతిగా, నిరర్ధకంగా నిలబడకండి. అడుగులో అడుగు వేస్తూ కార్యోన్ముఖులు కండి. తీవ్రమైన ఆకలి, పేదరికం మీకు సవాలు విసురుతోంది! దాన్ని తిప్పికొట్టాల్సి ఉంది. మీరొక మంచి మిషన్ (ధ్యేయం)లో నిమగమై ఉన్నారు. దేశం అన్ని వైపులా, అన్ని మూలల్లో విప్లవ జ్వాలలు అంటుకుంటున్నాయి. ప్రజల్ని సమాయత్తం చేయండి. వినిపిస్తున్న బిగుల్ ధ్వని (యుద్ధభేరి) వినండి. విని కదలండి. ఇలాగే నిశ్చేష్టులై నిస్సారంగా జీవితం గడపకండి..'' భగత్సింగ్ ఆయన కాలంలో చెప్పిన మాటలు ఈ కాలానికి కూడా పనికొస్తాయి. అందువల్ల ఆయన కన్న కలల్ని నిజం చేయాల్సిన బాధ్యత ఈ తరం యువతీ యువకుల మీద ఉంది. వారంతా తీవ్రంగా ఆలోచించాలి. లేవాలి. లేచి, కార్యాచరణకు పూనుకోవాలి. లేకపోతే ఇంకా ఇంకా నష్టం జరిగిపోతుంది. ఆ తర్వాత పశ్చాత్తాపంలో కుమిలిపోయినా లాభం ఉండదు.
హిట్లర్ పరిపాలనా కాలంలో ఫాసిజాన్ని వ్యతిరేకించే ఒక కార్యకర్త, కవి పాస్టర్ నిమోలర్ ఒక కవిత రాశాడు. అది తెలుగులోకి తెస్తే ఇలా ఉంటుంది...
మొదట వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చారు/ అప్పుడు నేనేం మాట్లాడలేదు-కారణం, నేను కమ్యూనిస్టుని కాదు కాబట్టి!/ తర్వాత వాళ్ళు ట్రేడ్ యూనియన్ వారికోసం వచ్చారు./ అయినా నేను మాట్లాడలేదు-/ కారణం, నేను ట్రేడ్ యూనియన్లో లేను కాబట్టి! / ఆ తర్వాత వాళ్ళు యూదుల కోసం వచ్చారు/ అప్పుడూ నేనేం మాట్లాడలేదు -/ కారణం, నేను యూదుణ్ణి కాదు కాబట్టి! / వాళ్ళు మళ్ళీ నాకోసం వచ్చారు - అంతే / అప్పటికి, నా గురించి మాట్లాడే వాళ్ళే మిగల్లేదు.
జరుగుతున్న అన్యాయాల సెగ మనకు తగలడం లేదు కదా అని తమాషా చూస్తూ ఉంటే, ఆ తర్వాత మన గురించి గొంతెత్తే వారే ఉండరు. సంఫ్ు పరివార్, బీజేపీలు కలిసి ఆ హిట్లర్ పథకాన్ని ఇక్కడ ఈ దేశంలో అమలు చేయాలని అనుకుంటున్నప్పుడు - దేశ ప్రజలు ఏం చేయాలి? అన్యాయాల మీద, అబద్ధాల మీద, అరాచకాల మీద అజ్ఞానం మీద, మూర్ఖత్వం మీద, పుకార్ల మీద, కుట్రల మీద, మనుషుల విభజన మీద తీవ్రంగా విరుచుకుపడాలి కదా? ఓర్చుకుని, నోరుమూసుకుంటే అది మరింత వినాశనానికే దారితీస్తుంది. మానవ జాతి అంతా ఒక్కటే అయినప్పుడు, ఈ దేశ వాసుల్లోనే కొందరు మనవారు కొందరు పరాయివారు ఎలా అవుతారు? మన అన్నా తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు ఉత్తపుణ్యానికి చనిపోతూ ఉంటే, విభజించి పాలిస్తున్న ఈ పాలకులు గొప్ప పాలన అందిస్తున్నారని మనమిక్కడ వేడుకలు చేసుకుందామా ?
దేశభక్తులు షహీద్ భగత్సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు లు 20 మార్చి 1931న పంజాబ్ గవర్నర్కు ఒక లేఖ పంపించారు. అందులోని సారాంశం ఇలా ఉంది...''-మేం చెప్పదల్చుకున్నదేమంటే, ఇక్కడ యుద్ధం ప్రారంభం కానే అయ్యింది. శ్రామికుల శ్రమ శక్తిని అన్యాయంగా దోచుకుని బలిసిపోతున్న కార్పొరేట్లకు వ్యతిరేకంగా ఈ యుద్ధం కొనసాగుతుంది. దోచుకునే కార్పొరేట్లు బ్రిటిషు వారయినా, స్వదేశీయులైనా మాకు ఒక్కటే... వాళ్ళంతా ఒక్కటై సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. జీవితాలు దుర్భరం చేస్తున్నారు. అందుకే చెపుతున్నాం. దోపిడీని, అణచివేతను ఇక ఎంతమాత్రమూ సహించం. రక్తం తాగేవాడు స్వదేశీయుడైతేనేమిటీ? విదేశీయుడైతేనేమిటి? మాకు అందరూ శత్రువులే!''
ఆనాడు ఆ దేశ భక్తులు వెలిబుచ్చిన ఆవేదనను ఇప్పుడు ఈ దేశ ప్రజలందరూ మళ్ళీ వెలిబుచ్చాల్సిన అవసరం వచ్చింది. కారణం ఇప్పుడు సమకాలీనంలో కూడా అదే పరిస్థితి ఉంది.
''ఒకప్పుడు జర్మనీలో జరిగినట్టుగానే ఇప్పుడు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం - అసలు సమస్యల నుండి దృష్టి మరల్చడానికి మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఉంది'' అన్నారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షులు జస్టిస్ మార్కండేయ కట్జూ.
అసలు సమస్యల నుండి దృష్టి మరల్చడానికి మన దేశ నాయకులు ప్రచారం చేస్తున్న అంశాలు: 1. పురాణాల్లో సైన్సు ఉంది. 2. మసీదులో లింగం ఉంది. 3. హిందీ భాషని దేశంలో తప్పనిసరి చేయాలి. 4. ముస్లింలను దేశం నుండి తరిమేయాలి. 5. ఘర్ వాపసీ - ఇతర మతాలలో ఉన్న వాళ్ళందరూ ఒకప్పుడు హిందువులే గనక వారందరూ మళ్ళీ ఇంటికి తిరిగి రావాలి. అంటే హిందువులుగా మారాలి. 6. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఈ దేశంలో ఎలాంటి హక్కులు ఉండకూడదు. 7. మొఘల్ చక్రవర్తులు దుర్మార్గులు. వారి కట్టడాలు, ఆనవాళ్ళు ఈ దేశంలో ఉండకూడదు. 8. స్త్రీల వస్త్రధారణ విధానాల వల్లనే రేప్లు జరుగుతున్నాయి. 9. ఆవు మూత్రం, ఆవుపేడలతో అన్ని రోగాలు నయం చేసుకోవచ్చు. 10. ఓం శబ్దం లోని మహత్తును నాసా కూడా గుర్తించింది - ఇలా ఇష్టం వచ్చిన విషయం మీద ఇష్టం వచ్చిన విధంగా అబద్ధాలు మాట్లాడుతూ దేశ ప్రజల్ని అయోమయంలో పడేయాలని వారు అనుకుంటున్నారు. అలా కాలక్షేపం చేస్తూ, అధికారంలో కొనసాగవచ్చు-నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచుకోవచ్చునన్నది వారి ఆలోచన !
ఐన్స్టీన్ లాంటి మహా శాస్త్రవేత్త, గోథే లాంటి మహా రచయిత, బెథోవెన్ వంటి మహా సంగీతకారుడు, కాంట్, నీషే, మార్క్స్ లాంటి గొప్ప తత్వవేత్తలు అందరూ జర్మన్లే. కాని 1933లో జర్మనీ-హిట్లర్ ఆధీనంలోకి రాగానే, పరిస్థితుల్ని పూర్తిగా మార్చేశాడు. సమస్యలన్నింటికీ యూదులే కారణమని ప్రచారం చేశాడు. ఆలోచనాపరుల మెదళ్ళలో కూడా విషం నింపాడు. ఫలితం ఏమైంది? సుమారు 60 లక్షల మంది యూదులను గ్యాస్ ఛాంబర్ లోకి పంపి హత్య చేయించాడు. చరిత్ర పుటల్లో కనీవినీ ఎరగని దుర్మార్గం అక్కడ జరిగిపోయింది. పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే ఫాసిజం పోకడలు ఇప్పుడు ఇక్కడ ఈ దేశంలో కూడా వున్నాయి. తమకు తాము దేశ భక్తులమని ప్రకటించుకున్న వారు, దేశ స్వాతంత్య్రానికి ముందు గానీ తర్వాత గానీ చేసేదంతా దేశద్రోహమేనన్నది తేలిపోయిన తర్వాత, రగిలిపోతున్న ఈ దేశ ప్రజలు ఆచరణ లోకి దిగకుండా ఉంటారా? సామాన్యుల సంఘటిత శక్తిని తక్కువగా అంచనా వేసే ఈ పాలకులే భవిష్యత్తులో అవహేళనకు గురికాబోతున్నారు. నియంతలకు చరిత్ర ఏ గతి పట్టిస్తూ వచ్చిందో మనందరికీ బాగా తెలుసు !
(వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త)
డా|| దేవరాజు మహారాజు