Mar 10,2023 15:05

హైదరాబాద్‌ : వైఎస్‌ వివేకా హత్య కేసును సీబీఐ కోర్టు ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ కేసులో విచారణకు జ్యూడిషియల్‌ ఖైదీలుగా ఉన్న సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, దేవి రెడ్డి శివశంకర్‌ రెడ్డితో పాటూ గంగిరెడ్డి, దస్తగిరి హాజరయ్యారు. విచారణ అనంతరం.. జ్యుడీషియల్‌ ఖైదీలను చంచల్‌ గూడా జైలుకు తరలించారు. అంతకుమునుపు వైసిపి ఎంపీ అవినాశ్‌ రెడ్డి దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ తీవ్ర చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలంటూ అవినాశ్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు.. ఈ పిటిషన్‌లో ఇంప్లీడ్‌ అయ్యేందుకు అనుమతించాలంటూ వివేకా కుమార్తె సునీత కోర్టును అభ్యర్ధించారు. దీనికి కోర్టు అనుమతించింది. కాగా..వైసీపీ ఎంపీ అవినాశ్‌ రెడ్డి తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. సీబీఐకి ఎంపీ పూర్తిగా సహకరిస్తున్నారన్నారు. ఇప్పటికే అవినాశ్‌ రెండుసార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారన్నారు. అప్పట్లో సీబీఐ అవినాశ్‌ స్టేట్‌మెంట్ల ఆడియో వీడియోలను రికార్డు చేయలేదని చెప్పారు. ఆయన సంతకం కూడా తీసుకోలేదన్నారు. ఆ రెండు స్టేట్‌మెంట్లను పక్కన పెట్టాలని అభ్యర్ధించారు. ఇప్పటివరకూ సీబీఐకి సహకరించిన తాము ఇక ముందు కూడా సహకరిస్తామని చెప్పారు.