Apr 01,2023 22:02

రేపు రాజస్తాన్‌తో సన్‌రైజర్స్‌ మ్యాచ్‌
హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు భువనేశ్వర్‌ కుమార్‌ సారథ్యంలో తొలి మ్యాచ్‌కు సిద్ధమౌతోంది. ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కు దక్షిణాఫ్రికా ఆటగాడు, కెప్టెన్‌ మార్కరమ్‌ దూరం కావడంతో భువనేశ్వర్‌ కుమార్‌ ఈ మ్యాచ్‌కు సారథ్యం వహించనున్నాడు. గత సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫర్వాలేదనిపించినా.. ప్లాేఆఫ్స్‌కు చేరడంలో విఫలమైంది. ఇక రాజస్తాన్‌ జట్టులో జాస్‌ బట్లర్‌, చాహల్‌తోపాటు యశస్వి జైస్వాల్‌, దేవదత్‌ పడిక్కల్‌ మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగల సమర్థులు. అలాగే సీనియర్‌ స్పిన్నర్‌ ఆర్‌. అశ్విన్‌ను ఏమాత్రం తీసిపారేయడానికి వీల్లేదు. ఇక బౌలింగ్‌ విభాగంలో బౌల్ట్‌, నవ్‌దీప్‌ సైనీ, సందీప్‌ శర్మ, మెక్‌ కొరుతో ప్రత్యర్ధి జట్టు భీకరంగా కనిపిస్తోంది. ఇక సన్‌రైజర్స్‌ జట్టుకు స్థానిక అభిమానులనుంచి మద్దతు లభించనుంది. మినీ వేలంలో సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీ రూ.15కోట్లకు కొనుగోలు చేసిన హారీ బ్రూక్స్‌ ఏమేరకు బ్యాటింగ్‌లో రాణిస్తాడో వేచిచూడాల్సి ఉంది.
మెట్రో రైళ్ల సంఖ్య పెంపు
రెండేళ్ల తర్వాత హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో ఐపిఎల్‌ జరగనుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుండగా.. క్రికెట్‌ అభిమానుల కోసం మెట్రో శుభవార్త చెప్పింది. ఆదివారం జరిగే మ్యాచ్‌ సందర్భంగా మెట్రో రైళ్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. రద్దీ నేపథ్యంలో నాగోల్‌-అమీర్‌పేట మార్గంలో ఎక్కువ సంఖ్యలో రైళ్లను నడుపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఎక్కువ సంఖ్యలో మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మరోవైపు ఉప్పల్‌ మ్యాచ్‌కు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. దాదాపు 1500 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. స్టేడియం లోపల, వెలుపల 340 సిసి కెమెరాలను ఏర్పాటు చేశామని, అలాగే జాయింట్‌ కమాండ్‌, కంట్రోల్‌ రూంను సైతం ఏర్పాటు చేసినట్లు వివరించారు. మధ్యాహ్నం 12.30గం||ల నుంచే ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తామని తెలిపారు.