Jul 31,2022 06:59

సర్వోన్నత న్యాయస్థానం ఎగ్జిక్యూటివ్‌ కోర్టుగా ఎలా మారిపోయిందో ఈ తిరోగమన తీర్పు తెలియచేస్తోంది. ప్రజలపై విరుచుకుపడుతున్న ప్రభుత్వం బారి నుండి రాజ్యాంగ హక్కులను పరిరక్షించు కోవడానికి కోర్టు చర్యలు తీసుకుంటున్న ఉదాహరణలు వున్నప్పటికీ ఈ తిరోగమన ధోరణి కూడా క్రమంగా బలాన్ని పుంజుకోవడం కల్లోలపరిచే వాస్తవంగా వుంది.

   కేవలం వారం రోజుల వ్యవధిలో సుప్రీం కోర్టు రెండు తీర్పులు ఇచ్చింది. ఈ తీర్పుల్లో పరస్పర విరుద్ధమైన పోకడలు స్పష్టంగా ప్రదర్శితమయ్యాయి. ఆల్ట్‌ న్యూస్‌ జర్నలిస్టు మహ్మద్‌ జుబేర్‌పై పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన కేసులో జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.బొపన్నలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పు చెబుతూ, అర్నేష్‌ కుమార్‌ కేసులో అత్యున్నత న్యాయస్థానం రూపొందించిన మార్గదర్శకాలకు, చట్టాలకు అనుగుణంగా అరెస్టు చేసే అధికారాలను కచ్చితంగా పరిమితంగా ఉపయోగించాలని స్పష్టం చేసింది. ''అరెస్టును ఒక శిక్షా సాధనంగా ఉద్దేశించకూడదని, ఉపయోగించరాదని, ఎందుకంటే దీనివల్ల తలెత్తే ఫలితాలు క్రిమినల్‌ చట్టమైన వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోవడం వల్ల ఎదురయ్యే అత్యంత తీవ్రమైన పర్యవసానాలకు దారి తీస్తాయని పేర్కొంది.
     ఈ తీర్పుతో, పోలీసు అధికారాలను ఏకపక్షంగా ఉపయోగించడానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు కీలక దెబ్బ వేసింది. పౌరుల ప్రాథమిక హక్కులను సమర్ధించింది. రాజ్యాంగాన్ని సమర్ధిస్తూ వ్యవహరించాల్సిన సుప్రీంకోర్టు నుండి ఊహించింది ఇదే. అయితే రెండు రోజుల తర్వాత, మనీ లాండరింగ్‌ నివారణా చట్టం, 2022 రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ, దాఖలైన పలు పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం మరో తీర్పును వెలువరించింది. సోదాలు, స్వాధీనం, అరెస్టులు, ఆస్తుల జప్తు వంటి విషయాల్లో సిఆర్‌పిసి (క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌) నిబంధనలను పాటించని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇ.డి)కు విస్తృతాధికారాలను ఇచ్చిన చట్ట నిబంధనలన్నింటిని జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్‌విల్కర్‌, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి, జస్టిస్‌ సి.టి.రవి కుమార్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సమర్ధించింది. ఇ.డి అంటే పోలీసులు కాదని, అందువల్ల వారు సిఆర్‌పిసి నిబంధనలను అనుసరించనక్కరలేదని కోర్టు సమర్ధించింది. అంటే, పోలీసు అధికారి ముందు చేసిన ప్రకటన మాదిరిగా కాకుండా నిందితుడు ఇ.డి అధికారుల ముందు చేసిన ప్రకటన కోర్టులో ఆమోదించదగ్గది. నిందితునికి బెయిల్‌ ఇవ్వడానికి ఈ రెండు షరతులు లేదా పరిస్థితులు సరైనవేనని కోర్టు సమర్ధించింది. ఆమె లేదా అతడు ఎలాంటి నేరానికి పాల్పడలేదని తెలియచేయాలి. అలాగే భవిష్యత్తులో కూడా ఎలాంటి నేరాలకు పాల్పడబోమని కోర్టును సంతృప్తిపరచాల్సి వుంటుంది. దీనివల్ల నిందితునిపైనే నిర్దోషినని రుజువు చేసుకునే భారం వుంటుంది. పైగా నిందితునికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఇసిఐఆర్‌) కాపీని ఇవ్వడం తప్పనిసరి కాదని కూడా కోర్టు పేర్కొంది. పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కాపీలా నిందితుడికి దీన్ని ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇది అంతర్గత పత్రమని పేర్కొంది. ఏకపక్షంగా తనదైన రీతిలో వ్యవహరించడానికి ఇ.డి కి వెసులుబాటు కల్పిస్తున్న ఇతర నిరంకుశ నిబంధనలన్నింటినీ కూడా కోర్టు సమర్ధించింది. ఈ తీర్పు ఇవ్వడం ద్వారా, ఏకపక్షంగా అరెస్టులు, ఆస్తుల జప్తు, బెయిల్‌ ఇవ్వకపోవడం వంటి చర్యలు పౌరులపై తీసుకోవడానికి, తద్వారా వారి పౌర స్వేచ్ఛలపై తీవ్రమైన దాడి చేయడాన్ని కూడా కోర్టు చట్టబద్ధం చేసింది.
     సర్వోన్నత న్యాయస్థానం ఎగ్జిక్యూటివ్‌ కోర్టుగా ఎలా మారిపోయిందో ఈ తిరోగమన తీర్పు తెలియచేస్తోంది. ప్రజలపై విరుచుకుపడుతున్న ప్రభుత్వం బారి నుండి రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకోవడానికి కోర్టు చర్యలు తీసుకుంటున్న ఉదాహరణలు వున్నప్పటికీ ఈ తిరోగమన ధోరణి కూడా క్రమంగా బలాన్ని పుంజుకోవడం కల్లోలపరిచే వాస్తవంగా వుంది. గుల్బర్గా సొసైటీ కేసులో జకియా జాఫ్రి, తీస్తా సెతల్వాద్‌లు పెట్టుకున్న పిటిషన్‌పై జస్టిస్‌ ఖాన్‌విల్కర్‌ నేతృత్వం లోని ఇదే త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఇటీవల కాలంలో వచ్చిన అత్యంత అధ్వాన్నమైన తీర్పుల్లో ఒకటి. వారి అప్పీల్‌ను బెంచ్‌ తిరస్కరిస్తూ, ''ఆమె (జకియా జాఫ్రి) మరొకరి ఆదేశాల మేరకే ఇలా వ్యవహరిస్తోంది.'' అని పేర్కొనడం ద్వారా కొంతమంది వ్యక్తుల ఉద్దేశాలను అనవసరంగా ప్రస్తావించేందుకు బెంచ్‌ సిద్ధపడిందని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మదన్‌ లోకుర్‌ పేర్కొన్నారు. హత్యకు గురైన తన భర్త ఎహసాన్‌ జాఫ్రికి న్యాయం జరగాలని పోరాడుతున్న జకియా జాఫ్రికి సాయపడుతున్న తీస్తాపై అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. ''నీచ ప్రయోజనాల కోసం సమస్య అలాగే మండుతూ వుండాలని కొంతమంది వ్యక్తులు కోరుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే, ఇటువంటి దుర్వినియోగ క్రమంతో ప్రమేయమున్న వారిని అదుపులోకి తీసుకుని చట్ట ప్రకారం ముందుకు సాగాల్సి వుంది.'' అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఆ రకంగా, సుప్రీం కోర్టుకు అప్పీల్‌ చేసుకున్న సహ పిటిషనర్‌ తీస్తా సెతల్వాద్‌ను అరెస్టు చేసేందుకు గుజరాత్‌ పోలీసులకు పరోక్షంగా కోర్టు లైసెన్స్‌ ఇచ్చింది. ఈ కేసులో ఆమె తరపు వాదనను కనీసం వినకుండానే అరెస్టు చేశారు.
     మొత్తంగా సర్వోన్నత న్యాయస్థానం దిగ్బంధంలో వుంది. న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో మొదలుపెడితే న్యాయ వ్యవస్థను వక్రీకరించేందుకు అన్ని రకాల ప్రయత్నాలూ జరుగుతున్నాయి. ఇటీవలే, బిజెపి మాజీ ప్రతినిధి నూపుర్‌ శర్మ వ్యవహార శైలిపై ద్విసభ్య ధర్మాసనం మౌఖికంగా చేసిన అధ్వాన్నమైన వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమాల్లో, సంఘి ప్రెస్‌లో ఇద్దరు న్యాయమూర్తులపై దుష్ప్రచారం జరిగింది. ఇటువంటి దారుణమైన దుర్వినియోగాన్ని విడనాడాలి.
     నిరంకుశ మతోన్మాద ప్రభుత్వ పద్ధతులు, మార్గాలకు అనుగుణంగానే హెచ్చరిక కూడా చాలా స్పష్టంగా వుంది. అత్యున్నత న్యాయ వ్యవస్థ ఈ ముప్పులను మరింత ధైర్యసాహసాలతో, కృతనిశ్చయంతో ఎదుర్కొనగలదని ఈ దేశ ప్రజలు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.

( 'పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం )