Mar 28,2023 21:22
  • రెండో రౌండ్‌కు అర్జున్‌-ధృవ్‌ కపిల జోడీ
  • సాత్త్విక్‌-చిరాగ్‌ జోడీకి 6వ ర్యాంక్‌

లాసన్నె: అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ సమాఖ్య(బిడబ్ల్యుఎఫ్‌) తాజా ర్యాంకింగ్స్‌లో పివి సింధు టాప్‌-10లో చోటు దక్కించుకోలేకపోయింది. గత వారం జరిగిన స్విస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన సింధు.. ఈ ఏడాది మాత్రం రెండోరౌండ్‌లోని నిష్క్రమించింది. దీంతో రెండుసార్లు ఒలింపిక్స్‌ పతక విజేత సింధు మంగళవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన 27ఏళ్ల సింధు.. రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తర్వాత గాయం కారణంగా ఎక్కువ టోర్నీలో ప్రాతినిధ్యం వహించలేదు. దీంతో 60,448పాయింట్లతో 11వ ర్యాంక్‌కే పరిమితమైంది. పివి సింధు మహిళల సింగిల్స్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ 2వ స్థానం. ఇక పురుషుల డబుల్స్‌లో స్విస్‌ ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన సాత్త్విక-చిరాగ్‌ శెట్టి జోడీ 6 ర్యాంక్‌లో నిలువగా.. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణరు రారు 6వ స్థానం, కిదాంబి శ్రీకాంత్‌ 21వ స్థానం, లక్ష్యసేన్‌ 25వ స్థానాల్లో నిలిచారు. ఇక మహిళల డబుల్స్‌లో త్రీసా జోలీ-గాయత్రీ గోపీచంద్‌ జంట 18వ స్థానానికి ఎగబాకారు.

  • ఎంఆర్‌ అర్జున్‌-ధృవ్‌ కపిల శుభారంభం..

స్విస్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌లో ఎంఆర్‌ అర్జున్‌-ధృవ్‌ కపిల జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలిరౌండ్‌ పోటీలో అర్జున్‌-ధృవ్‌ కపిల 16-21, 21-17, 21-12తో స్కాట్లాండ్‌కు చెందిన ఎం.గ్రిమ్లే-సి.గ్రిమ్లే జోడీని చిత్తుచేసింది. తొలి గేమ్‌ను ఓడిన భారత జంట రెండు, మూడు గేమ్‌లలో సత్తా చాటడం విశేషం. ఇక పురుషుల, మహిళల సింగిల్స్‌ పోటీలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి.