ఢిల్లీ: సెప్టెంబరులో వస్తు, సేవల పన్ను వసూళ్లు 10 శాతం పెరిగి రూ.1.62 లక్షల కోట్లకు చేరాయి. 2022 సెప్టెంబరులో ఇవి రూ.1.47 లక్షల కోట్లుగా ఉన్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. సెప్టెంబరులో స్థూలంగా జీఎస్టీ వసూళ్లు రూ.1,62,712 కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో కేంద్ర జీఎస్టీ రూ.29,818 కోట్లు, రాష్ట్రాల జీఎస్టీ రూ.37,657 కోట్లు, ఐజీఎస్టీ రూ.83,623 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.41,145 కోట్లతో కలిపి), సెస్సు రూ.11,613 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.881 కోట్లతో కలిపి)గా ఉన్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు నాలుగు సార్లు జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు దాటడం విశేషం. ఈ ఏడాది ప్రథమార్ధంలో రూ.9,92,508 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. వార్షిక ప్రాతిపదికన 11 శాతం వఅద్ధి నమోదైంది. ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ వసూళ్లు రూ.1.65 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత నెల వసూళ్లలో ఐజీఎస్టీ నుంచి కేంద్రం రూ.33,736 కోట్లు సీజీఎస్టీ , రూ.27,578 కోట్లు ఎస్జీఎస్టీ కింద సర్దుబాటు చేసింది. ఫలితంగా గత నెలలో కేంద్ర ప్రభుత్వ సీజీఎస్టీ ఆదాయం రూ.63,555 కోట్లు, రాష్ట్రాల ఎస్జీఎస్టీ ఆదాయం రూ.65,235 కోట్లుగా నమోదైంది.