- ఉజ్జీవన్ ఎస్ఎఫ్బి వెల్లడి
- ఏడాదిలో ఆంధ్రాకు విస్తరణ
హైదరాబాద్ : ఈ ఏడాది మార్చి ముగింపు నాటికి కొత్తగా 27 శాఖలను ఏర్పాటు చేయడం ద్వారా.. మొత్తం 625 బ్రాంచీలకు చేరనున్నామని ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎఫ్బి) వెల్లడించింది. ప్రస్తుతం ఈ బ్యాంక్కు 598 శాఖలున్నాయి. తెలంగాణలోని తొలి శాఖను మాదాపూర్లో ఏర్పాటు చేయగా.. దీన్ని బుధవారం హోంశాఖ మంత్రి మహమూద్ అలీ లాంచనంగా ప్రారంభించారు. ఆ బ్యాంక్ సిఇఒ, ఎండి ఇట్టిర డవిస్, ఛైర్మన్ బిఎ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్లో నాలుగు శాఖలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్, విజయవాడలో శాఖలను ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రస్తుతం 25 రాష్ట్రాల్లో 71 లక్షల మంది ఖాతాదారులున్నారన్నారు. 17వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని.. కొత్త శాఖల ఏర్పాటుతో నూతన నియామకాలు చేపట్టనున్నామన్నారు. బ్యాంక్ రుణ పుస్తకం ఏడాదికేడాదితో పోల్చితే 33 శాతం పెరిగి రూ.4,800 కోట్లకు చేరిందన్నారు. త్వరలోనే ట్రాక్టర్, పసిడి రుణాల సౌలభ్యాన్ని అందుబాటులోకి తేనున్నామన్నారు.










