Nov 09,2022 21:02

లండన్‌ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు రూ.13వేల కోట్లు పైగా కన్నమేసి బ్రిటన్‌కు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీని ఎట్టకేలకు భారత్‌కు తీసుకురావడానికి మార్గం సుగమం అయ్యింది. చీటింగ్‌, మనీలాండరింగ్‌కు పాల్పడిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీకి లండన్‌ హైకోర్టు భారీ షాక్‌ ఇచ్చింది. నీరవ్‌ను భారత్‌కు అప్పగించాలంటూ గత ఫిబ్రవరిలో వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్ట్‌ జిల్లా న్యాయమూర్తి సామ్‌ గూజెస్‌ తీర్పునిచ్చారు. ఈ తీర్పుని సవాలు చేస్తూ లండన్‌ హైకోర్టులో నీరవ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ అపీల్‌ను బుధవారం తిరస్కరిస్తూ.. భారత ఎజెన్సీలకు అనుకూలంగా న్యాయమూర్తులు లార్డ్‌ జస్టిస్‌ జెరెమీ స్టువర్ట్‌ స్మిత్‌, జస్టిస్‌ రాబర్ట్‌ జే తీర్పునిచ్చారు. నీరవ్‌ మోడీని అప్పగించడం అన్యాయం లేదా అణచివేత కాదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. దీంతో నీరవ్‌ను భారత్‌ తీసుకొచ్చేందుకు మార్గం సులువయ్యింది. నీరవ్‌ మోడీ ఒక్కరే పిఎన్‌బిని రూ.6,498కోట్లకు మోసం చేశారు. ఆయన మామ మెహుల్‌ చోక్సితో కలిసి దాదాపు రూ.13,578 కోట్ల మొత్తానికి పిఎన్‌బిని ముంచారు. మోసపూరిత లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌ (ఎల్‌ఒయు)లను ఉపయోగించి.. మోసపూరితంగా నగదు పొందారు. డమ్మీ కంపెనీల పేరుతతో 2011 నుంచి దాదాపు ఆరేళ్ల పైగా ఈ మోసాలు చేస్తూ వచ్చారు. 2018 ప్రారంభంలో ఎట్టకేలకు ఈ మోసం బయటపడింది. సిబిఐ కేసు ఫైల్‌ చేసిందనే సమాచారంతో బ్రిటన్‌ పారిపోయారు. ఇంత పెద్ద నేరం చేసిన నీరవ్‌ మోడీ దేశం దాటడానికి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు మద్దతు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నీరవ్‌ లండన్‌ పారిపోగా.. చోక్సి అంటిగాకు పరార్‌ అయ్యాడు. భారత బ్యాంకింగ్‌ చరిత్రలోనే ఇది అతిపెద్ద మోసంగా చోటు చేసుకుంది.