- తెలుగు సంస్థకు రూ.6545 కోట్ల ప్రాజెక్టు
హైదరాబాద్ : దేశ, విదేశాల్లో భారీ ప్రాజెక్టులను చేపట్టి రికార్డు కాలంలో పూర్తి చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ లిమిటెడ్ (ఎంఇఐఎల్) మంగోలియా గడ్డపై మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును దక్కించుకుంది. మంగోలియా దేశంలోనే తొలి చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్మించేందుకు ఉద్దేశించిన మంగోల్ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్ కోసం లెటర్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్సీ (ఎల్ఒఎ)ని అందుకున్నట్లు ఆ కంపెనీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్టు విలువ 790 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.6545 కోట్లు) ఈ రిఫైనరీని ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఒప్పందం పద్దతిలో నిర్మించనున్నట్లు వెల్లడించింది. భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) డెవలప్మెంట్ పార్టనర్షిప్ అడ్మినిస్ట్రేషన్ చొరవతో, భారత ప్రభుత్వం ఆర్థిక సహాయ సహకారాలతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు ఆ కంపెనీ పేర్కొంది. దీంతో అక్కడి స్థానిక ప్రజల ఉపాధి అవకాశాలు మెరుగుపడి యువతకు ప్రోత్సాహకరమైన భవిష్యత్ ఉండబోతోందని తెలిపింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత రోజుకు 30,000 బ్యారెల్స్, ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల ముడి చమురును ప్రాసెస్ చేయవచ్చని పేర్కొంది.










