Jan 18,2023 21:06

హైదరాబాద్‌ : వైద్య సేవల రంగంలో ఉన్న కామినేని హాస్పిటల్స్‌ తాజాగా కర్నూలులో ఆసుపత్రిని ప్రారంభించింది. జెమ్‌కేర్‌ కామినేని హాస్పిటల్స్‌ పేరుతో రూ.150 కోట్లతో 150 పడకలతో దీన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ ఏడాదే రూ.75 కోట్లతో 75 పడకల సామర్థ్యంతో క్యాన్సర్‌ చికిత్స కేంద్రం సైతం స్థాపించనున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ నగరంలో వైద్య సేవల కోసం మొత్తంగా రూ.225 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. మెరుగైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలతో వైద్య సేవలను ఈ కేంద్రం తదుపరి స్థాయికి మారుస్తుందని సంస్థ తెలిపింది. అందుబాటు ధరలో ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించడం లక్ష్యంగా ఈ కేంద్రాన్ని నెలకొల్పినట్టు కామినేని హాస్పిటల్స్‌ తెలిపింది. జెమ్‌కేర్‌లో కార్డియాక్‌, న్యూరో, అనస్తీషియా, క్రిటికల్‌ కేర్‌, జనరల్‌ మెడిసిన్‌, మెడికల్‌, సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఇఎన్‌టి, జనరల్‌, మినిమల్‌ యాక్సెస్‌ సర్జరీ, ప్లాస్టిక్‌, కాస్మెటిక్‌ సర్జరీ, రెనల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌, యూరాలజీ, జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీస్‌ తదితర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. నాణ్యమైన వైద్య సేవలతో కోట్లాది మందికి చేరువైన కామినేని హాస్పిటల్స్‌ మొత్తం 3,000లకుపైగా పడకలతో హైదరాబాద్‌, నార్కట్‌పల్లి, విజయవాడలో ఆసుపత్రులను నిర్వహిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్‌, డెంటల్‌ కళాశాలలు ఉన్నాయి.