ప్రజాశక్తి-అమరావతి : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను ఏపీ హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం 2.15 గంటలకు తదుపరి విచారణను చేపడతామని తెలిపింది. లోకేష్ బెయిల్ పిటిషన్పై ఈ నెల 4న విచారణ జరిగింది. ఆ విచారణను ఈరోజుకు వాయిదా వేసింది. అయితే తదుపరి విచారణ వరకు లోకేష్ను అరెస్ట్ చేయవద్దని సీఐడీ అధికారులను ఆదేశించింది. మరోవైపు ఈ కేసులో లోకేష్ పేరును చేర్చలేదని గత విచారణ సందర్భంగా హైకోర్టుకు సీఐడీ తెలిపింది. అయితే చంద్రబాబు కుటుంబ సభ్యులు లబ్ధి పొందినట్టు చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో సీఐడీ పేర్కొందని.. ఈ నేపథ్యంలో లోకేష్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నందువల్లే తాము బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్టు లోకేష్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.










