Feb 10,2023 07:22

కర్నూలు మండలం దేవమడ గ్రామంలోనూ ఇంకా కొన్ని చుట్టుపక్కల గ్రామాల్లోనూ గ్రామ వాలంటీర్లు దళితుల ఇళ్లకు వెళ్ళరు. వాళ్ళనే తమ ఇళ్ళకు పిలిపించుకుంటారు. ఊళ్ళోని ప్రతి ఇల్లూ తిరగడమన్నది గ్రామ వాలంటీర్ల ఉద్యోగ ధర్మం. దాన్ని పక్కన పెట్టి వ్యవహరించడం ఎంత తప్పు? అయితే వారిని అడిగేవారు లేరు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇంతటి వివక్ష కొనసాగుతూ ఉందంటే... మనుషులుగా మనమంతా తల వంచుకోవాలి. అన్ని వర్గాల వారికి సమ న్యాయం చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వోద్యోగులు, పాలకులు సిగ్గుపడాలి ! 

నేను విప్లవకారుణ్ణి. అన్ని దేశాలూ నావే. నిజమైన విప్లవ కారుడు ఓ అద్భుతమైన ప్రేమికుడై ఉంటాడని నేను చెప్తే మీకు కాస్త ఆశ్చర్యంగానే ఉండొచ్చు. కానీ, ప్రేమించే గుణాన్ని కోల్పోయిన వాడు ఎన్నటికీ గొప్ప విప్లవకారుడు కాలేడు. ప్రపంచంలో ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా మనం గాఢంగా ప్రతిస్పందించడం చాలా అవసరం. ప్రతి వారికీ ఉండి తీరాల్సిన అద్భుతమైన లక్షణం అదే! - చే గువేరా

ర్నూలు జిల్లాలో కులరక్కసి కరాళ నృత్యం చేస్తోంది. కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన సర్వేలో ఒళ్ళు గగుర్పొడిచే నిజాలు బయటపడ్డాయి. సుమారు ఎనభై తొమ్మిది గ్రామాల్లో పదిహేను రకాల కులవివక్షలు కనిపించాయి. అరవై నాలుగు గ్రామాల్లో దళితులకు దేవాలయ ప్రవేశంలేదు. ముప్పయి గ్రామాల్లో దళితులు రచ్చబండపై కూర్చోవడానికి వీల్లేదు. ఇప్పటికీ అక్కడ ఏడు గ్రామాల్లో టీ కొట్లలో రెండు గ్లాసుల పద్ధతి కొనసాగుతూ ఉంది. ఆరు గ్రామాల్లో దళితుల్ని హోటళ్ళ లోకి అసలే అనుమతించరు. ఇరవైఏడు గ్రామాల్లో చాకలివారు దళితుల బట్టలు ఉతకరు. తొమ్మిది గ్రామాల్లో క్షురకులు దళితులకు క్షవరం చేయరు. ఈ పనుల కోసం వారు సమీపంలోని పట్టణాలకు వెళుతున్నారు.
        ''జుట్టు కత్తిరించడం మంగలి యొక్క పవిత్రమైన ధర్మం కాదు. ఇది ఒక వ్యాపారం. చెప్పులు కుట్టడం మాదిగవాడి పవిత్ర ధర్మం కాదు. అది కూడా వ్యాపారమే! ప్రదర్శించే పూజలు, హోమాలు, ఉత్సవాలలో కూడా అది జరుగుతోంది. ఇది బ్రాహ్మణుడి పవిత్రమైన ధర్మమేమీ కాదు. అలా అనుకోవడం మన అజ్ఞానం. మన అజ్ఞానం మీదే బ్రాహ్మణుడికి తిని కూర్చునే పెద్ద వ్యాపారం జరుగుతూ ఉంది!'' అన్నారు మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఆధునికులుగా మనకు తోచకపోతే పోయింది. కనీసం కొందరు మహానుభావులు చెప్పిన దాంట్లోంచి సారాంశమైనా గ్రహించాలి కదా? ఇదే విషయం మీద డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా ఏం చెప్పారో గమనించండి...''బ్రాహ్మణులు, కోమట్లు, షేక్‌లు, సయ్యద్‌లు పెద్ద కులాలకు చెందినవారు. కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి, సాలె, మాల, మాదిగలు చిన్న కులాల వారు. వీరి సంఖ్య 90 శాతం దాకా ఉంది. కుల భేదాల వల్ల వీరి మేధస్సు బందీ అయిపోయింది. వీరిని పైకి తెస్తే తప్ప, దేశ పునర్నిర్మాణం జరగదు. కాళ్ళూ, చేతులూ కదిలించకపోతే శరీరానికి పక్షవాతం వచ్చినట్లు... దేశానికీ పక్షవాతం వచ్చింది. దేశంలోని ఈ 90 శాతం ప్రజలకు రెండు వేల సంవత్సరాలుగా పక్షవాతం వచ్చింది. సమాజంలో వీరిని ఎక్కడికక్కడ పాతరేసి స్థిరపరిచారు. కదలిక లేకుండా చేశారు. బానిసత్వానికి మూల కారణం ఇదే. ఇప్పటికైనా మారకపోతే మరోసారి బానిసలయ్యే ప్రమాదముంది.'' ఇలాంటి హెచ్చరికల్ని మనం ఇప్పటికైనా పట్టించుకోవాలా? వద్దా? ఇరవై ఒకటవ శతాబ్దపు అత్యాధునికులమని గొప్పలు పోవడం కాదు, అందుకు తగిన విధంగా ఆలోచనా సరళిని మార్చుకోవాల్సి ఉంది.
         మంత్రాలయ మఠంలో- చదువుకున్న దళితులైనా సరే, కేవలం ఊడ్చడానికే అర్హులు! ఆ పని తప్ప మరో పని చేయనివ్వరు. బిల్లులు రాయడానికి గానీ, రిసెప్షనిస్ట్‌లుగా పని చేయడానికి గానీ వారికి అవకాశమివ్వరు. అక్కడవారు చదువుకున్న చదువు వృధా కావల్సిందే! కొన్ని ఊళ్ళలో దళితులు మోటారు వాహనాలపై తిరగకూడదు. పెళ్ళి ఊరేగింపులు సైతం వాహనాలపై చేసుకోగూడదు. కాలి నడకన వెళ్ళాల్సిందే. మంచి నీటి బావుల్లోకి సైతం దిగనివ్వరు. బావిలోంచి నీరే తోడుకోనివ్వనప్పుడు, ఇక నీళ్ళలోకి దిగి పనులు చేయనిస్తారా? దళితులతో కలిసి సహపంక్తి భోజనం చేయడమన్నది ఊహకు అందని విషయం. మంత్రాలయ మండలంలోని బసాపురంలో పెత్తందార్ల కార్లు వెళుతూ ఉంటే ఎంతటి విద్యావంతులైన దళితులైనా సరే... టక్కున లేచి నిలబడి వంగి నమస్కారం పెట్టాల్సిందే. కర్నూలు మండలం దేవమడ గ్రామంలోనూ ఇంకా కొన్ని చుట్టుపక్కల గ్రామాల్లోనూ గ్రామ వాలంటీర్లు దళితుల ఇళ్లకు వెళ్ళరు. వాళ్ళనే తమ ఇళ్ళకు పిలిపించుకుంటారు. ఊళ్ళోని ప్రతి ఇల్లూ తిరగడమన్నది గ్రామ వాలంటీర్ల ఉద్యోగ ధర్మం. దాన్ని పక్కన పెట్టి వ్యవహరించడం ఎంత తప్పు? అయితే వారిని అడిగేవారు లేరు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇంతటి వివక్ష కొనసాగుతూ ఉందంటే... మనుషులుగా మనమంతా తల వంచుకోవాలి. అన్ని వర్గాల వారికి సమ న్యాయం చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వోద్యోగులు, పాలకులు సిగ్గుపడాలి !
         కర్ణాటక లోని కొప్పల్‌ జిల్లా మయాపూర్‌ గ్రామంలో అగ్రవర్ణం వారు దళిత కుటుంబానికి ఇరవై అయిదు వేల రూపాయల జరిమానా విధించారు. ఎందుకంటే ఒక దళితుడు గుడి బయట నిలబడి, కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు. ఆ సమయంలో వెంట ఉన్న అతని రెండేళ్ల కొడుకు గబుక్కున గుళ్ళోకి వెళ్ళిపోయాడు. తను దళితుడినని, తను గుళ్ళోకి వెళ్ళకూడదని ఆ పసివాడికి తెలియదు. ఆ రోజు ఆ పసివాడి పుట్టిన రోజు. అందుకే వాణ్ణి తీసుకుని తండ్రి గుడికి వెళ్ళాడు. వాణ్ణి చల్లగా చూడమని కోరుకుంటూ ఆ దళితుడు దండం పెట్టుకుంటూ ఉండగా...ఆ ''ఘోర ప్రమాదం'' జరిగిపోయింది. ఒక దళితుడు గుళ్ళోకి జొరబడ్డాడని, గుడి మైల పడిందనీ, దాన్ని ప్రక్షాళన చేయాలని...అందుకు రూ.25 వేలు ఖర్చు అవుతుందనీ పూజారులు బెదిరించారు. తనకు అంత శక్తి లేదని, తను ఒక నిరుపేదనని దళితుడు ఎంత మొత్తుకున్నా లాభం లేకపోయింది. అగ్రవర్ణ అహంకారం తగ్గలేదు. పెద్ద గలాటా జరిగింది. ప్రభుత్వాధికారుల చొరవతో విషయం సద్దుమణిగింది. ఇంగిత జ్ఞానం లేక, మానవత్వం లేక మనుషులు ప్రవర్తిస్తున్నప్పుడు-గోరుతో పోయేది గొడ్డళ్ళ దాకా వస్తుంది. ఇది 2021 సెప్టెంబర్‌ సంఘటన. ఇలాంటి సంఘటనే తమిళనాడులో జరిగింది. ఒక గుళ్ళోకి దళిత మహిళను రానియ్యలేదు. ఆ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌కు తెలిసింది. వెంటనే ఆ గుడికి సంబంధించిన ఇరవైమంది పూజారుల మీద ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టించి వారిని జైలుకు పంపారు. ఇతర రాష్ట్రాలలో కూడా అలా చేయగలిగే అవకాశం ఆయా మంత్రులకు, ముఖ్యమంత్రులకు ఉంటుంది. రాజ్యాంగం గురించి అందరూ గొప్పగా మాట్లాడుతారు కానీ, ఎవరైనా అలా చేస్తున్నారా ?
           మహిళల అభ్యున్నతికై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్త్రీలకు బస్సు ప్రయాణం ఉచితం చేశారు. ఒకరోజు కన్యాకుమారి జిల్లా వాణీయం కుడి గ్రామానికి చెందిన సెల్వం అనే డెబ్బయ్యేళ్ల మహిళ తన చేపల బుట్టతో బస్సు ఎక్కింది. చేపలు వాసన వస్తున్నాయంటూ కండక్టర్‌ బలవంతంగా ఆమెను బస్సు నుండి దింపేశాడు. అవి నిలువ చేపలు కావని, ఆ రోజు పట్టినవేనని, చేపలన్నాక కొంచెం వాసననొస్తాయనీ, అయినా తను ఎక్కువ దూరమేమీ రావడం లేదని ఆ వృద్ధురాలు ఎంత మొత్తుకున్నా కండక్టర్‌ వినలేదు. 'పాపం పోనీయండి'-అని తోటి ప్రయాణీకులు చెప్పినా, అతను వినిపించుకోలేదు. బలవంతంగా దింపేశాడు. ఆమె కుళచ్చళ్‌ బస్టాండ్‌లో అందరికీ తనకు జరిగిన అన్యాయం చెప్పుకుంది. ఆనోటా ఆనోటా అది సోషల్‌ మీడియాకెక్కింది. రవాణాశాఖ అధికారులకు, తర్వాత ముఖ్యమంత్రికీ తెలిసింది. ఆ వృద్ధురాలి హక్కును కాదన్నందుకు ఆ బస్సు కండక్టర్‌, డ్రైవర్‌లను సస్పెండ్‌ చేశారు స్టాలిన్‌. అణగారిన వర్గాలకు ఎక్కడికక్కడ న్యాయం జరగాలంటే చిత్తశుద్ధి ఉన్న నాయకులు కావాలి. ఉట్టి 'భాషణ్‌'లిచ్చే నాయకులు వృధా కదా మిత్రోం ?
          మనుస్మృతి ప్రకారం మహిళలందరూ శూద్రులే. మహిళలకు పుట్టిన వారంతా శూద్రులే అవుతారు కానీ, మళ్ళీ అందులో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఎలా పుట్టగలరూ? పుట్టిన వాళ్ళందరూ శూద్రులే అయినప్పుడు అగ్ర-నిమ్న వర్గాలెందుకూ? ఇదంతా బుద్ధి తక్కువ వ్యవహారంగా అనిపించడం లేదూ? ఇదంతా కాదు. మహిళలు శూద్రులైనప్పుడు, ఉన్న జనాభా అంతా శూద్రులే - అందరూ సమానులే. విజ్ఞాన శాస్త్రం అదే చెప్పింది-మానవజాతి అంతా ఒక్కటే కాబట్టి, అందరూ సమానులే - అంది. మనుధర్మ శాస్త్ర ప్రకారం కూడా మనుషులంతా సమానులే-అని మనం అర్థం చేసుకోవాలి. మనమంతా బాల్యంలో బాలకులం. యవ్వనంలో యువకులం. వృద్ధాప్యంలో పండుటాకులం...అంతే! మనువును తిరస్కరిస్తేనే ఎవరికైనా కాస్త బుద్ధి, జ్ఞానం పెరుగుతుంది.
         రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక పెద్దాయన పక్కనున్న యువకుణ్ణి ఊహించని ప్రశ్న అడిగాడు. మీ కేస్ట్‌ ఏమిటీ అని! యువకుడు అందగాడే కాదు తెలివైనవాడు కూడా. విషయం గ్రహించి వెంటనే 'సాఫ్ట్‌వేర్‌' అండీ అన్నాడు.
        ''భలే జోకులేస్తావు బాబూ...నేను అడిగింది వేరు. నువ్వు చెప్పేది వేరు. పోనీ, మీ నాన్నగారి కులమేమిటీ'' అని మళ్ళీ అడిగాడు పెద్దాయన.
''ఆయనా? ఆయన ఎలక్ట్రికల్‌ అండీ'' అన్నాడు యువకుడు.
     ''పోనీలే - నీకు చెప్పాలని లేనట్లుంది! ఈ మధ్య ఏమిటో కుర్రవాళ్ళు చిత్రమైన జవాబులు చెపుతున్నారు. కులం చెప్పుకుంటే నామోషీయేమో''-అని ముఖం మాడ్చుకుని, తల తిప్పుకున్నాడు.
''మీరు పెద్దవారు. మీకు తిక్కతిక్కగా సమాధానాలు చెప్పాలని నాకు లేదు. విషయేమిటంటేనండీ...భగవద్గీత లోని నాలుగో అధ్యాయంలో పదమూడవ శ్లోకం ఒకసారి నెమరు వేసుకోండి. మీకే అర్థమవుతుంది!'' అన్నాడు.
''అవునూ ఏముందు అందులో?'' ఈ కుర్రాడికి గీతలోని విషయాలు కూడా తెలుసా? అని ఆశ్చర్యపోతూ అడిగాడు.
''గుర్తులేకపోతే ఫరవాలేదు. ఇంటికెళ్ళాక చూసుకోండి!'' నవ్వుతూ బదులిచ్చాడు యువకుడు.
''సరే బాబూ చెబుదూ అందులో ఏముందో'' అన్నాడు పెద్దాయన.
       ''ఏముందంటే... కులమనేది పుట్టుకతో కాదు, చేసే వృత్తితో వస్తుంది-అని ఉంది. దాని ప్రకారమే చెప్పానండీ అంతే-మిమ్మల్ని ఆటపట్టించాలని కాదు-మీకేమో కోపం వచ్చేసింది'' అని నవ్వు కొనసాగించాడు. పెద్దాయనకు ఎక్కడో కలుక్కుమంది. 'జ్ఞానం' వయసు పెరిగితే రాదు-బుద్ధి పెరిగితేనే వస్తుందని అప్పుడే తెలుసుకున్నాడు. పాత తరహాలో ఇక మాట్లాడగూడదని కూడా అనుకున్నాడు.
మనుస్మృతి ప్రకారం-(త్రిన్ష:9/93) పురుషులు 24-30 ఏళ్ళ వయసులో 8-12 ఏళ్ళ వయసులో ఉన్న బాలికల్ని పెళ్లి చేసుకోవాలి. ఇదే కాదు 3-4 ఏళ్ళ బాలికలకు 7-8 ఏళ్ళ బాలురకు కూడా పెళ్ళిళ్ళు చేసిన ఆచారం ఈ దేశంలో కొనసా గింది. మరి సమకాలీనంలో దాన్ని కొనసాగించడం లేదు కదా? అందుకే సంప్రదాయం ముసుగులో పనికిరాని ఆచారా ల్ని వదిలేయాలి. అన్నీ ఆలోచించే డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ మనుస్మృతిని దహనం చేశాడన్న విషయం గుర్తుంచుకోవాలి !

/ వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త/
డా|| దేవరాజు మహారాజు

డా|| దేవరాజు మహారాజు