Jan 21,2023 20:36

న్యూఢిల్లీ : టెక్నలాజీ కంపెనీల్లో జరుగుతున్న పరిణామాలు ఆ రంగ ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. అనేక కంపెనీలు వరుసగా ఉద్యోగులకు ఉద్వాసనలు పలకడంతో వారి భవిష్యత్తుపై బెంబేలెత్తుతున్నారు. తాజాగా ప్రముఖ ఐటి కంపెనీ విప్రో 452 మంది ఫ్రెషర్లను తొలగిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. శిక్షణ తర్వాత కూడా పనితీరు మెరుగుపరుచుకోవడంలో విఫలమైనందుకు వారి పట్ల ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. పనితీరు విషయంలో విప్రో ఉన్నత ప్రమాణాలను పాటిస్తుందని పేర్కొంది. పని ప్రదేశంలో కొత్త ఉద్యోగులకు ఈ నియమం వర్తిస్తుందంటూ అభిప్రాయపడింది. ఇతర కంపెనీల్లో పని చేస్తూ... విప్రోలోనూ ఉద్యోగాలు చేసిన 300 మందిని గతేడాది చివరలో తొలగించింది. 2022 డిసెంబర్‌ త్రైమాసికంలో ఆ కంపెనీ 600 మందిని కొత్తగా తీసుకున్నట్లు పేర్కొంది. ఇంతక్రితం రోజు గూగుల్‌ మాతృసంస్థ అల్పాబెట్‌ ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 12,000 మంది సిబ్బందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రిక్రూటింగ్‌, కార్పొరేట్‌ కార్యకలాపాలు, ఇంజినీరింగ్‌, ప్రొడక్ట్స్‌ టీమ్‌కు చెందిన విభాగాలతో పాటు ఇతర విభాగాల్లో ఉద్వాసనలు పలికింది. ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ 380 ఉద్యోగులను శుక్రవారం తొలగించింది. ఇటీవల మైక్రోసాఫ్ట్‌ 10వేల మందిని, ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా 11,000 మందిని తొలగించగా.. ట్విట్టర్‌ సగం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చిత్తి కారణంగా గడిచిన అక్టోబర్‌ మాసంలో ఐటి, బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ (బిపిఎం) విభాగాల్లో కొత్త నియామకాలు సగం మేర పతనమయ్యాయని ఇటీవల సిఐఇఎల్‌ హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌ ఓ రిపోర్టులో తెలిపింది. భవిష్యత్తు సాఫ్ట్‌వేర్‌ తప్పనిసరి అయితే తప్పా కంపెనీలు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలకు తోడు స్టార్టప్‌లకు నిధుల కొరత తదితర అంశాలు కొత్త నియామకాలపై ప్రభావం చూపుతున్నాయని ఆ రంగం నిపుణులు పేర్కొంటున్నారు. ఉన్న ఉద్యోగాలు ఊడటానికి తోడు కొత్త నియామకాలు లేకపోవడంతో ఈ రంగంపై ఆశలు పెంచుకున్న అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.