Nov 12,2022 21:06

న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ) సూచీ ఏడు శాతం దిగువనకు తగ్గొచ్చని ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అంచనా వేశారు. శనివారం ఆయన హెచ్‌టి లీడర్‌షిప్‌ సమ్మిట్‌ 2022లో మాట్లాడుతూ ద్రవ్యోల్బణం తమకు ప్రధాన సవాల్‌గా మారిందన్నారు. తాము నిర్దేశించుకున్న లక్ష్యం 6 శాతం పరిమితి కంటే ఎక్కువగా నమోదవుతుందన్నారు. సెప్టెంబర్‌లో ఇది 7.4 శాతానికి ఎగిసిన విషయాన్ని దాస్‌ గుర్తు చేశారు. ''అక్టోబర్‌ మాసం ద్రవ్యోల్బణం సూచీ గణంకాలు సోమవారం విడుదల కావొచ్చు. ఇది 7 శాతం దిగువన ఉండొచ్చు. ధరల కట్టడికి చాలా ప్రభావితంగా పని చేస్తున్నాము.'' అని దాస్‌ తెలిపారు. గ్లోబల్‌ ద్రవ్యోల్బణం కూడా రానున్న రోజుల్లో దిగిరానుందన్నారు. వచ్చే ఫిబ్రవరి నాటికి భారత్‌లో ద్రవ్యోల్బణం 4.5 శాతానికి తగ్గొచ్చని అంచనా వేశారు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఘర్షణలు ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్నాయన్నారు. దేశంలో సిపిఐని 4 శాతానికి కట్టడి చేయాలని కృత నిశ్చయంతో ఉన్నామన్నారు.