Oct 25,2023 20:47
  • ఆరు నెలల్లో 2వేల కిలోల స్మగ్లింగ్‌
  • అధిక పన్ను రేట్ల ఎఫెక్ట్‌

న్యూఢిల్లీ : భారత్‌లోకి అక్రమంగా తీసుకొచ్చిన బంగారం భారీగా పట్టుబడుతోంది. కేంద్ర ప్రభుత్వం పసిడిపై అమలు చేస్తున్న హెచ్చు పన్ను రేట్ల నుంచి తప్పించుకోవడానికి స్మగ్లర్లు అడ్డదారుల్లో దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన కాలంలో బంగారం స్మగ్లింగ్‌ 43 శాతం పెరిగి 2,000 కిలోలుగా నమోదయ్యింది. ఈ మొత్తం బంగారం భారత్‌లోకి అక్రమంగా దిగుమతి అయ్యిందని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (సిబిఐసి) ఛైర్మన్‌ సంజరు కుమార్‌ అగర్వాల్‌ వెల్లడించారు. అత్యధికంగా మయన్మార్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల నుంచి భారత్‌లోకి బంగారాన్ని తీసుకొస్తున్నారన్నారు. గతేడాది ఇదే ఏప్రిల్‌ - సెప్టెంబర్‌ కాలంలో 1,400 కిలోలు, 2022-23లో మొత్తంగా 3800 కిలోలు పట్టుబడిందన్నారు.
''బంగారం అక్రమ రవాణ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. కేవలం కస్టమ్స్‌ సుంకం అధికంగా ఉండడం వల్లే కాదు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లోని ధరలను బట్టి కూడా అక్రమ రవాణ పెరుగుతుంది.'' అని సంజరు కుమార్‌ మీడియాతో అన్నారు. 'డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డిఆర్‌ఐ) రిపోర్ట్‌ ప్రకారం.. భారత్‌లో భారీ గిరాకీతో పాటు అధిక దిగుమతి సుంకం బంగారం స్మగ్లింగ్‌కు దారితీస్తుంది. బంగారంపై 12.5 శాతం కస్టమ్స్‌ డ్యూటీతో పాటు 2.5 శాతం ఎఐడిసి , మూడు శాతం ఐజిఎస్‌టి అమల్లో ఉంది. మొత్తంగా 18.45 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. భారత్‌ బంగారం అవసరాల్లో అత్యధిక భాగం దిగుమతుల ద్వారానే సమకూరుతోంది.