Nov 01,2022 21:06
  • ఎపిలో రూ.3,579 కోట్ల రాబడి
  • టిఎస్‌లో రూ.3,854 కోట్లు

ముంబయి : ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో రూ.1,51,718 కోట్ల వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లయ్యింది. ఈ నూతన పన్ను విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇదే రెండో సారి అతిపెద్ద వసూళ్లు కావడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.1.67 లక్షల కోట్ల జిఎఎస్‌టి వసూళ్లయ్యింది. గత నెల పన్ను వసూళ్లలో సిజిఎస్‌టి కింద రూ.26,039 కోట్లు, ఎస్‌జిఎస్‌టి కింద రూ.33,396 కోట్ల రాబడి చోటు చేసుకుంది. ఐజిఎస్‌టి కింద రూ.81,778 కోట్లు, సెస్సెల రూపంలో రూ.10,505 కోట్ల చొప్పున నమోదయ్యాయి. గతేడాది అక్టోబర్‌ వసూళ్లతో పోల్చితే గడిచిన నెలలో 16.6 శాతం పెరుగుదల చోటు చేసుకుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో జిఎస్‌టి వసూళ్లు రూ.3,579 కోట్లకు పెరిగాయి. గతేడాది ఇదే నెలలో రూ.2,879 కోట్లుగా నమోదయ్యాయి. తెలంగాణలో గతేడాది అక్టోబర్‌లోలో వసూళ్లయిన రూ.3,854 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది 11 శాతం వృద్థితో రూ.4,284 కోట్లకు చేరాయి.