ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కిమ్స్ సవేరా ఆసుపత్రి సహకారంతో పారిశుద్ధ్య కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత గుండె వైద్య శిబిరాన్ని మేయర్ మహమ్మద్ వసీం గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ విజయభాస్కర్ రెడ్డి, వాసంతి, కమిషనర్ రమణారెడ్డి, హెల్త్ ఆఫీసర్ గంగాధర్ రెడ్డి కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య రక్షణ కోసం తమ పాలక వర్గం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. నిత్యం పని ఒత్తిడితో ఉండే కార్మికులు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉంటారని, ముందస్తు ఆరోగ్య రక్షణ కోసం గుండె సంబంధిత పరీక్షలను చేపట్టడం జరుగుతోందన్నారు. అదే విధంగా మహిళా ఉద్యోగులకు గైనిక్ పరీక్షలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తొలి విడతలో 2 సర్కిళ్ల పరిధిలోని కార్మికులకు వైద్య పరీక్షలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు హసీనా, మల్లికార్జున, అనిల్ కుమార్ రెడ్డి, ఇషాక్ పాల్గొన్నారు.