Apr 05,2023 17:17

కోల్‌కతా: బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌-అల్‌-హసన్‌ స్థానంలో ఇంగ్లండ్‌ విధ్వంస బ్యాటర్‌ జేసన్‌ రాయ్‌ను తీసుకుంటున్నట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫ్రాంచైజీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. గాయం కారణంగా షకీబ్‌ ఐపీఎల్‌ 16వ సీజన్‌కు పూర్తిగా దూరం కావడంతో అతడి స్థానంలో జేసన్‌ రాయ్‌కు రూ.2.8 కోట్లను ఆఫర్‌ చేసి సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది. వాస్తవానికి రాయ్‌ బేస్‌ ప్రైజ్‌ రూ.1.5 కోట్లు ఉండగా..అందుకు అదనంగా మరో రూ.1.3 కోట్లు వెచ్చించింది. రాయ్‌ గతంలో మూడు సీజన్ల పాటు ఐపీఎల్‌ ఆడాడు. 2017,2018, 2021లలో మొత్తంగా 13 మ్యాచ్‌లు ఆడాడు. 2021లో అతడు సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కి ప్రాతినిథ్యం వహించాడు. షకిబ్‌ స్థానంలో రాయ్‌కు అవకాశం కల్పించిన ఫ్రాంచైజీ.. శ్రేయస్‌ అయ్యర్‌కు రిప్లేస్‌మెంట్‌పై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.