Nov 01,2022 21:00

ముంబయి : డిజిటల్‌ రూపీ చలామణీని ఆర్‌బిఐ లాంచనంగా ప్రారంభించింది. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా మంగళవారం ఎంపిక చేసిన బ్యాంక్‌ల ద్వారా టోకు లావాదేవీలను నమోదు చేశారు. క్లియరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా డేటా ప్రకారం.. తొలి రోజు బ్యాంక్‌లు రూ.275 కోట్ల విలువ చేసే బాండ్లను ట్రేడింగ్‌ చేశాయి. ఇ-రూపీని వచ్చే నెల రోజుల్లోనే రిటైల్‌ రంగ లావాదేవీలకు అనుమతించనున్నట్లు ఆర్‌బిఐ సోమవారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. క్రిప్టో లాంటి ప్రయివేటు కరెన్సీలకు ధీటుగా దీన్ని తీసుకొచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎలాంటి రిస్కు లేకుండా సులభంగా డిజిటల్‌ వేదికపై కరెన్సీ లావాదేవీలు నెరవేర్చేలా రూపకల్పన చేసినట్లు పేర్కొన్నాయి. ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టులో ఎస్‌బిఐ, బిఒబి, యుబిఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌, ఐడిఎఫ్‌సి ఫస్ట్‌ బ్యాంక్‌, హెచ్‌ఎస్‌బిసి బ్యాంక్‌లు భాగస్వామ్యం అవుతున్నాయి.