Sep 29,2023 17:50

ప్రజాశక్తి-అమరావతి : అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వచ్చే నెల 3కి వాయిదా వేసింది ఏపీ హైకోర్ట్‌. ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరపున సిద్ధార్థ్‌ లూథ్రా, సీఐడీ తరపున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. రింగ్‌ రోడ్‌ మార్గంలో లింగమనేనికి భారీగా భూములు వున్నాయని శ్రీరామ్‌ వాదించారు. లింగమనేని భూముల పక్కనుంచి రోడ్‌ వెళ్లేలా అలైన్‌మెంట్‌ మార్పులు చేశాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలైన్‌మెంట్‌ మార్పు తర్వాత లింగమనేని భూముల విలువ భారీగా పెరిగిందని.. లింగమనేని, హెరిటేజ్‌ సంస్థలు భూ అక్రమాలకు పాల్పడ్డాయని శ్రీరామ్‌ వాదించారు. భువనేశ్వరి అకౌంట్‌ నుంచి అద్దెను చెల్లించారని సిద్ధార్థ్‌ లూథ్రా వాదించారు. చంద్రబాబు, భువనేశ్వరికి 91 నోటీసు ఇవ్వొచ్చు కదా అని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేవలం రాజకీయ కక్షతోనే చంద్రబాబుపై కేసులు పెట్టారని సిద్ధార్థ్‌ లూథ్రా వాదించారు.