Jun 20,2023 20:49
  • నాల్గో టైటిల్‌పై భారత్‌ గురి
  • 3న చైనాతో తొలి మ్యాచ్‌

చెన్నై: ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ-2023 హాకీ షెడ్యూల్‌ మంగళవారం విడుదలైంది. ఆగస్టు 3నుంచి 12వరకు రాధాకృష్ణన్‌ హాకీ స్టేడియంలో టోర్నీ జరగనుంది. భారతజట్టు తన తొలి లీగ్‌ మ్యాచ్‌ను చైనాతో ఆడనుంది. ఇక డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కొరియా-జపాన్‌ జట్ల మధ్య జరిగే అదేరోజు జరిగే తొలి మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం 6జట్లు టైటిల్‌కై తలపడనున్నాయి. భారత్‌తోపాటు కొరియా, మలేషియా, పాకిస్తాన్‌, జపాన్‌, చైనా జట్లు బరిలోకి దిగనున్నాయి. ఆరుజట్లు ఒకే గ్రూప్‌లో ఉండగా.. లీగ్‌ దశ ముగిసిన అనంతరం టాప్‌-4లో ఉన్న జట్లు సెమీస్‌లో తలపడనున్నాయి. ఈమేరకు హాకీ ఇండియా అధ్యక్షులు దిలీప్‌ టర్కే మాట్లాడుతూ.. ఈసారి ఛాంపియన్స్‌ ట్రోఫీకి చెన్నై ఆతిథ్యమిస్తోందని భారతజట్టు టైటిల్‌ చేజిక్కించుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే ఆటగాళ్ల జాబితాను వెల్లడిస్తామన్నారు. ఇక తమిళనాడు హాకీ ప్రెసిడెంట్‌ శేఖర్‌ జె. మనోహర్‌ మాట్లాడుతూ.. అంతర్జాతీయ టోర్నమెంట్‌ అయిన ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ చెన్నై ఆతిథ్య హక్కులు దక్కడం అరుదైన గౌరవంగా భావిస్తున్నామని, టోర్నీ సజావుగా సాగేందుకు కృషిచేస్తామన్నారు. ఇక భారత 2011, 2016, 2018లో, పాకిస్తాన్‌(2012, 2013, 2018) జట్లు మూడేసిసార్లు టైటిల్‌ విజేతగా నిలిచాయి.