
ప్రపంచంలోనే మూడవ అత్యంత ధనవంతునిగా ఖ్యాతికెక్కిన గౌతమ్ అదానీ వ్యాపార మోసాల పుట్ట పగిలింది. ఇంతకాలం ఆయన చక్కబెట్టిన అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. అదానీ నెరపిన మార్కెట్ కుంభకోణాలను అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక పెట్టుబడుల పరిశోధన సంస్థ 'హిండెన్బర్గ్ రిసెర్చ్' రెండు రోజుల క్రితం తన నివేదిక ద్వారా ప్రపంచానికి చాటింది. దాంతో డబ్బు సంపాదనా పరులకు ఆదర్శంగా నిలిచిన అదానీ ఆర్థిక ఎదుగుదల వెనుక గల మోసపు బాగోతాల గుట్టు లోకానికి తెలిసొచ్చినట్లయింది. హిండెన్బర్గ్ రెండేళ్లపాటు శోధించి తయారు చేసిన ఈ నివేదిక బిజెపి, కార్పొరేట్ల కుమ్మక్కును మరోసారి బట్టబయలు చేసింది. షేర్లలో అవకతవకలకు, అకౌంట్స్లో మోసాలకు, మనీలాండరింగ్కు అదానీ గ్రూపు పాల్పడిందన్నది హిండెన్బర్గ్ నివేదిక సారాంశం. ఆ రిపోర్టులో లేవనెత్తిన పలు అంశాలు, ప్రశ్నలపై అదానీ సమాధానం చెప్పకుండా, తమను దెబ్బతీయడానికి చేసిన కుట్ర అని ఎదురుదాడి చేశారు. ప్రతిగా తమ నివేదికపై కట్టుబడి ఉన్నామని, ఎలాంటి చర్యలకైనా సిద్ధమని హిండెన్బర్గ్ చేసిన సవాల్పై అదానీ వైపు నుంచి స్పందన శూన్యం.
పైకి రోల్మోడల్స్గా కనిపించే నల్లకోటు కార్పొరేట్ల చీకటి దందాలు హిండెన్బర్గ్ నివేదికతో మరోసారి బహిర్గతం అయ్యాయి. అదానీ గ్రూపులోని ఏడు ప్రధాన కంపెనీల షేర్లను తిమ్మినిబమ్మిని చేసి కృత్రిమంగా ధరలు పెంచుతున్నారు. ఆ షేర్లను తాకట్టుపెట్టి బ్యాంకుల నుంచి అడ్డగోలుగా అప్పులు తెస్తున్నారు. అందినకాడికి పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నారు. పన్ను ఎగవేతదారులకు అనుకూలంగా ఉన్న సింగపూర్, మారిషస్, కరీబియన్ దీవులు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి లాభాలను వాటిలోకి మనీలాండరింగ్ పద్ధతుల్లో తరలిస్తున్నారు. ఇటువంటి అక్రమాలతోనే అదానీ గ్రూపులోని షేర్లు ఎకాయికిన 819 శాతం పెరిగాయి. నికర విలువ 231 శాతానికి ఎగబాకింది. మూడేళ్ల క్రితం గ్రూపు వర్త్ రూ.1.62 లక్షల కోట్లు కాగా ఇప్పుడు 9.78 లక్షల కోట్లు. ఈ స్వల్ప సమయంలో 8.1 లక్షల కోట్లు పెరగడం అసాధారణం. కరోనా విలయంతో ప్రజలు అల్లాడుతుండగా అదానీ సంపద అనూహ్యంగా పెరిగింది మోసాల నిచ్చెనతోనేనన్న విషయంలో ఎలాంటి సందేహం ఉండనవసరం లేదు. గతంలో సత్యం రామలింగరాజు కంపెనీదీ ఇదే బాపతు. హిండెన్బర్గ్ పేల్చిన బాంబుతో అదానీ కంపెనీ షేర్లు కుప్పకూలాయి. రూ.వేల కోట్ల విలువైన సంపద ఆవిరైంది. మొన్నటి వరకు ప్రపంచంలో మూడవ అత్యంత ధనవంతునిగా విరాజిల్లిన అదానీ రెండు రోజుల్లో ఏడవ స్థానానికి దిగజారాడు. షేర్ మార్కెట్లో సంపద గాలి బుడగ అనడానికి ఇదొక ఉదాహరణ. అదానీ గ్రూపులోని షేర్లలో 85 శాతం కుప్పకూలతాయని హిండెన్బర్గ్ చేసిన హెచ్చరికకు తాజా పరిణామం బలాన్ని చేకూరుస్తోంది.
హిండెన్బర్గ్ నివేదిక అదానీకో లేదంటే ఆ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరులకో పరిమితం కాదు. మోడీ ప్రభుత్వానికీ పెద్ద కుదుపు. అదానీ-మోడీ మధ్య అవినాభావ సంబంధం బహిరంగం. 1988లో చిన్న ఎగుమతి, దిగుమతి కంపెనీతో వ్యాపారం ప్రారంభించిన అదానీకి 1991 నుంచి దేశంలో ప్రారంభమైన సరళీకరణ విధానాలు ఊపునిచ్చాయి. గుజరాత్ సిఎంగా మోడీ వచ్చాక అదానీ ప్రభ వెలిగింది. మోడీ దేశ ప్రధాని అయ్యాక అదానీ వాణిజ్య సామ్రాజ్యం అవధులు దాటింది. ఎయిర్పోర్టులు, పోర్టులు, రైల్వే, రోడ్డు, విద్యుత్, గ్యాస్, బొగ్గు, రియల్, ఒకటేమిటి... సకలం అదానీ వశమవుతున్నాయి. కేంద్ర బిజెపి ఆశ్రితపక్షపాతం లేకుండా అదానీ ఇంతగా ఎదగడం అసాధ్యం. శ్రీలంక, బంగ్లాదేశ్ల్లోనూ అదానీ మోనోపోలికి మోడీ సర్కారే కారణం. అదానీ పోర్టులు డ్రగ్స్ అక్రమ రవాణాకు కేంద్రాలుగా మారాయని వెల్లడైంది. ఇంతకుముందు అక్రమాలకు సంబంధించిన కేసులలో అదానీ కంపెనీలపై సెబి నిషేధం విధించగా, దానిని జరిమానా కింద మార్చి అదానీ బయట పడ్డారు. సెబి, ఆర్ఒసి, ఇడి, సిబిఐ, నిఘా సంస్థలు కొమ్ము కాస్తున్నందునే అదానీ మార్కెట్ మాయాజాలం సక్సెస్ అయింది. హిండెన్బర్గ్ రిపోర్టుతోనైనా కేంద్రం అదానీ ఆర్థిక అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయించాలి. ఆర్థిక నేరగాళ్లను బోనులో నిలబెట్టాలి.