Nov 08,2022 20:55

న్యూఢిల్లీ : ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ అన్‌అకాడెమీ మరో 350 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. గత ఏప్రిల్‌లోనే అన్‌అకాడెమీ 1,000 మంది ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసింది. వ్యయ నియంత్రణలో భాగంగా కంపెనీ నుంచి మరో 10 శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నామని అన్‌అకాడెమీ సిఇఒ గౌరవ్‌ ముంజల్‌ మంగళవారం వెల్లడించారు. ఇది కష్టమైన నిర్ణయమే అయినప్పటికీ.. మరో మార్గం లేదని ఉద్యోగులకు ఇచ్చిన సమాచారంలో పేర్కొన్నారు. తొలగించిన ఉద్యోగులకు నోటీసు పీరియడ్‌తో పాటు అదనంగా రెండు నెలలకు సమానమైన వేతనాన్ని ఇస్తామన్నారు. అదనంగా ఒక ఏడాదికి ఆరోగ్య బీమా కవరేజీని కల్పిస్తామన్నారు. మరో ఉద్యోగం పొందడానికి కావాల్సిన మద్దతు కూడా అందిస్తామన్నారు. ఆన్‌లైన్‌ కార్యకలాపాలు సైతం తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు.