Jan 13,2023 22:15

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌) ఇంటి నుంచి పని సౌలభ్యాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇకపై ఉద్యోగులందరూ విధిగా కార్యాలయాలకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకూ ఇంటి నుంచి పనిచేసిన వారంతా తమ రోల్స్‌కు అనుగుణంగా తిరిగి ఆఫీసులకు రావాలని సూచించింది. ''ఆఫీస్‌కు వచ్చి పనిచేస్తే ఉద్యోగులకు మరిన్ని విషయాలు అనుభవ పూర్వకంగా తెలుస్తాయి. చాలా పనులు జరుగుతాయి. ముఖ్యంగా గత రెండేళ్లకాలంలో చేరిన ఉద్యోగులకు ఈ అనుభవం చాలా అవశ్యం. కొత్త ఉద్యోగులు ఆఫీస్‌లకువస్తే టిసిఎస్‌ విభిన్న కోణం అర్థమవుతుంది. వారివారి పాత్రలు ఏంటనేవి ఉద్యోగులకు తెలుస్తాయి'' అని టిసిఎస్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఎన్‌ గణపతి సుబ్రమణియమ్‌ పేర్కొన్నారు. అందుకే ఇంటి నుంచి పనిసౌలభ్యాన్ని 100 శాతం రద్దు చేస్తున్నామన్నారు. కాగా.. ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు.