Oct 29,2020 00:45

ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూల్లో పాల్గొన్న విద్యార్థులు

విశాఖపట్నం : కరోనా సమయంలోనూ ప్రముఖ ఐటి కంపెనీలు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తున్న ఇంటర్య్వూలలో గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రతిభ కనబరిచి భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఇటీవలే ప్రముఖ బహుళజాతి సంస్థ ఎక్సెంచూర్‌ నిర్వహించిన ఆన్‌లైన్‌ ప్రాంగణ నియామకాలలో ఏకంగా 209 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఎంపిక కాగా తాజాగా ప్రముఖ ఐటి సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌) నిర్వహించిన ఆన్‌లైన్‌ పరీక్షలో 37 మంది ఉద్యోగాలు సాధించారు. హైదరాబాద్‌ టిసిఎస్‌ శాఖ డిజిటల్‌ మాద్యమానికిగాను జరిగిన ఈ ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలలో ఎంపికైన వారికి రూ.7.33 లక్షల వార్షిక వేతనం లభించనుంది. గీతం కెరీర్‌ సర్వీసెస్‌ అసిస్టెంట్‌ డీన్‌ కమాండర్‌ గురుమూర్తి గంగాధరన్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపికయిన విద్యార్థులు టిసిఎస్‌ సంస్థలోని కృత్రిమ మేధ, మిషన్‌ లెర్నింగ్‌, బిగ్‌డేటా, రోబోటిక్స్‌, క్లౌడ్‌ కంప్యూటరింగ్‌, ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ప్రాజెక్టులలో పనిచేస్తారని తెలిపారు. ఎక్సెంచూర్‌కు ఎంపికైన విద్యార్థులను గీతం వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.శివరామకృష్ణ, ప్రో-వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ వి.జయశంకర్‌, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ డి.గుణశేఖరన్‌ అభినందించారు.